RAJANTH: విశాఖను డ్రగ్స్‌ సరఫరా కేంద్రంగా మార్చారు

RAJANTH: విశాఖను డ్రగ్స్‌ సరఫరా కేంద్రంగా మార్చారు
జగన్‌ ప్రభుత్వంపై రాజ్‌నాథ్‌ తీవ్ర విమర్శలు... పోలవరం కూడా పూర్తి చేయలేరా..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో మేధావులతో జరిగిన సమావేశంలో ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి భరత్‌, ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్‌ రాజులతో కలిసి ఆయన పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కూడా జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని రాజ్‌నాథ్‌ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మాత్రం లెక్కకు మించి అప్పులు చేసిందని రాజ్‌నాథ్‌ సింగ్‌ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం మొత్తం రూ. 13.50లక్షల కోట్ల అప్పులు చేసి.. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ.2లక్షల రుణభారం మోపింది. ఖాజానా ఖాళీ చేసి పన్నుల భారం ప్రజల మీద వేసింది.

ఆంధ్రప్రదేశ్‌ను, విశాఖను డ్రగ్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌గా జగన్‌ ప్రభుత్వం మార్చిందని రాజ్‌నాథ్‌సింగ్‌ విమర్శించారు. ల్యాండ్‌, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, మైనింగ్‌ మాఫియాలు ఆంధ్రప్రదేశ్‌లో స్వైర విహారం చేస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో పూర్తిగా కూరుకుపోయిందని మండిపడ్డారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధికి భరోసా కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్‌ విస్మరించిన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి తెలుగువారిపై ఉన్న గౌరవాన్ని ఎన్డీయే ప్రభుత్వం చాటి చెప్పింది. వచ్చే ఐదేళ్లలో దేశంలో జమిలి ఎన్నికలకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడతామని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story