RBK Employee : ఆర్బీకే ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్న ఎరువుల విక్రయాలు

RBK Employee : ఆర్బీకే ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్న ఎరువుల విక్రయాలు
అధికారుల వేధింపులు, వైఎస్సార్సీపీ నేతల దౌర్జన్యం

అద్దె చెల్లించలేదని భవన యజమానుల నుంచి ఒత్తిళ్లు, నగదు జమ చేయలేదని అధికారుల నుంచి వేధింపులు... ఇవన్నీ చాలవన్నట్లు అధికార పార్టీ నేతల బెదిరింపులు. ఇది రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగుల ఆవేదన. బాపట్ల జిల్లాలో ఓ R.B.K. ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవటం ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని ఉద్యోగులు వాపోతున్నారు.

బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలి రైతు భరోసా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలిగా పనిచేస్తున్న ఉద్యోగి బి.పూజిత ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆమె పని చేస్తున్న R.B.K.కు శాశ్వత భవనం లేదు. గ్రామ సచివాలయంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన పాత గదుల్ని సరుకు నిల్వ కోసం కేటాయించారు. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షాలకు 142 D.A.P. బస్తాలు తడిచిపోయాయి. దీనితోపాటు గ్రామంలో కొందరు అధికార పార్టీ నేతలు డబ్బులు ఇవ్వకుండా ఎరువుల బస్తాలు తీసుకెళ్లారు. ఒక్క నాయకుడే 43వేల రూపాయలు బకాయి చెల్లించాల్సి ఉంది. తడిచిన బస్తాల డబ్బులు, బకాయిలు అన్నీ చెల్లించాలని పూజితను అధికారులు ఆదేశించారు. దీంతో తీవ్ర మనస్థాపంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

రాష్ట్రంలో చాలాచోట్ల రైతుభరోసా కేంద్రాలకు శాశ్వత భవనాలు లేవు. చాలాచోట్ల R.B.K.లు ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయి. వాటికి అద్దెలు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయి. యజమానులు తాళాలు వేసుకుంటున్నారు. అలాంటి సమయంలో సిబ్బంది సమీపంలోని సచివాలయం నుంచి విధులు నిర్వహించాలని అధికారులు ఆదేశిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా R.B.K. సిబ్బంది ఇన్ని పాట్లు పడుతున్నా... కొంతమంది అధికార పార్టీ నేతలు తమ దర్పం చూపిస్తున్నారు. డబ్బులు చెల్లించకుండా ఎరువులు తీసుకెళ్తున్నారు. తర్వాత ఇస్తామని మభ్యపెడుతున్నారు. అలాంటి వారిని ఎదిరించలేక, సరుకుకు లెక్కలు చెప్పలేక సిబ్బంది సతమతమవుతున్నారు. ఉన్నతాధికారులు మాత్రం పంపిన సరకు ప్రకారం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తుండటంతో R.B.K. సిబ్బంది మనోవేధనకు గురవుతున్నారు. పూజిత కూడా ఇలా మనోవేధనతోనే మరణించిందని R.B.K. ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు.

R.B.K.లకు మౌలిక వసతుల కల్పన, అవసరమైన సిబ్బందిని కేటాయిస్తే ఇలాంటి ఇబ్బందులు తొలగుతాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story