TDP: టీడీపీ అధికారంలోకి వస్తే పేదలకు రెండు సెంట్ల స్థలం!

TDP: టీడీపీ అధికారంలోకి వస్తే పేదలకు రెండు సెంట్ల స్థలం!
మేనిఫెస్టోలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తోన్న టీడీపీ.... నిశితంగా పరిశీలిద్దామన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) అధికారంలోకి వస్తే పేదలకు రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చే ఆలోచనలో టీడీపీ (TDP) ఉంది. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తోంది. రాజ్యసభ (Rajya Sabha) ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలిద్దామన్న చంద్రబాబు (Chandra Babu) సందర్భానుసారం నిర్ణయం తీసుకుందామని నేతలతో అన్నట్లు సమాచారం. పాదయాత్ర, ఎన్నికల మ్యానిఫెస్టోలో మొత్తం 730 హామీలిచ్చిన జగన్‌.. వాటిలో 621 అసలు అమలే చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఇందులో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్యనేతలు హాజరయ్యారు. నేటి నుంచి జరగనున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.


రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడంపైనా చర్చ జరిగింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన పరిణామాల్ని నిశితంగా గమనిద్దామని, పార్టీ అభ్యర్థిని పోటీకి నిలబెట్టే అంశంపై సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. జగనన్న కాలనీలు, సెంటు భూమి పేరుతో పేదల్ని జగన్‌ మోసం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పేదలకు మెరుగైన సౌకర్యాలతో ప్రతిష్ఠాత్మకంగా ఇళ్ల నిర్మాణం చేపడదామని ఆయన తెలిపారు. ఆ సందర్భంగానే ఆయన రెండు సెంట్ల ప్రతిపాదన చేశారు. దీని సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి మేనిఫెస్టోలో చేరుద్దామన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చే మూడు రోజులు ఇక్కడే ఉంటారు కాబట్టి మేనిఫెస్టో కమిటీతో కూర్చుని సూచనలు, సలహాలు ఇవ్వాలని చంద్రబాబు తెలిపారు. తెదేపా అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేద్దామని, ప్రజలకు మెరుగైన సేవలందించేలా తీర్చిదిద్దుదామని ఆయన అన్నట్లు తెలిసింది.


శాసనసభ సమావేశాల్లో ప్రజాసమస్యలపై గట్టిగా పోరాడాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జగన్‌ ప్రభుత్వం గవర్నర్‌ ప్రసంగం ద్వారా ప్రజలకు అవాస్తవాలు చెబుతుందని, వాటిని తీవ్రంగా ఖండించాలని సూచించారు. ఇవే చివరి సమావేశాలు కాబట్టి సభలోను, బయట ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ముందు... నిత్యావసర ధరల పెరుగుదలపై నిరసన తెలిపేలా కార్యాచరణ రూపొందించారు. జగన్‌ మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చామంటూ అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో అతిపెద్ద విఫల ముఖ్యమంత్రిగా నిలిచిపోతారని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేస్తున్న జగన్‌కు మరో రెండు నెలల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. మద్య నిషేధమని హామీ ఇచ్చి, మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25 వేల కోట్ల రుణం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story