ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్టులు

ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్టులు


ఇవాళ ఏపీలో.... టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు పోలీసులు. ఇసుక సత్యాగ్రహం పేరుతో మూడ్రోజులుగా టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మైనింగ్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ కార్యాలయాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల్ని ముందస్తు అరెస్టు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మరోవైపు గుంటూరులోని మైనింగ్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు టీడీపీ నేతలు.

అటు ఎన్టీఆర్ జిల్లాలోనూ హౌస్ అరెస్టులు కొనసాగాయి. పలు చోట్ల టీడీపీ నేతల్ని గృహనిర్బంధం చేశారు. టీడీపీ నేతలు ఎవరూ బయటికి రాకుండా చర్యలు తీసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలో మొత్తం ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి, ఎమ్మార్వో కార్యాయలం వద్ద, ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద పోలీసు స్టేషన్ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. ఇసుక దోపిడిని నిరసిస్తూ... ఇబ్రహీంపట్నం మైన్స్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో... హౌస్ అరెస్టులు చేశారు. అటు గన్నవరంలో టీడీపీ నేతలు జాస్తి వెంకటేశ్వరరావును గృహనిర్బంధం చేశారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story