కేంద్ర హోంమంత్రి అమిత్షాతో టీడీపీ ఎంపీల సమావేశం
గత ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్నాళ్లకు TDP ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిశారు. ఏపీలో టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులు, దేవాలయాలపై దాడులు తదితర అంశాలను అమిత్ షాకు వివరించారు. షాను కలిసిన వారిలో గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు.
రాష్ట్రంలో జడ్జిలు, ఎస్ఈసీపై దాడులు, మత మార్పిడిలు, ఆలయాలపై దాడుల గురించి అమిత్ షాకు ఫిర్యాదు చేశామన్నారు ఎంపీ గల్లా జయదేవ్. మీడియాపై కూడా దాడి జరుగుతోందని.. కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారని చెప్పామని గల్లా వెల్లడించారు.
వైసీపీ దురాగతాలను అమిత్షా దృష్టికి తీసుకెళ్లామన్నారు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, విమర్శించినా.. ప్రతిపక్ష నేతలు, మీడియాపై కేసులు పెడుతున్నారని.. వీటిపై విచారణ జరపాలని ఫిర్యాదు చేశామని తెలిపారు. వీటికి సంబంధించి ఆధారాలను కేంద్ర హోంమంత్రికి సమర్పించామన్నారు. రాష్ట్రంలో ఇలాంటివి జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమనే అభిప్రాయాన్ని అమిత్షా వ్యక్తం చేసినట్లు కనకమేడల పేర్కొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com