మత్స్యకారుడి అదృష్టం.. ఆ చేప ఖరీదు లక్ష రూపాయలు..
అరుదైన చేపలు అతడి వలలో చిక్కాయి. మార్కెట్లో వాటి ధర లక్షలు పలుకుతున్నాయి. నదులు, సముద్రాలలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకి చేపలు చిక్కితేనే వారి జీవితం గడుస్తుంది. అదే ఆధారంగా బతుకుతున్న వారికి ఏ రోజైనా వలలో చేపలు పడకపోతే ఆ రోజు పస్తు పడుకుంటారు.
ఒక్కోసారి అదృష్టం బావుంటే అరుదైన చేపలు వలకి చిక్కుతాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన మత్స్యకారులు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన కృష్ణాజిల్లా మత్స్యకారుల వలలో అరుదైన చేపలు పడ్డాయి. కచిలి చేపలి అనే 16 కిలోల మగచేప, 15 కిలోల ఆడచేప దొరకడంతో మత్స్యకారులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
ఈ చేపలను మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్కు తీసుకువచ్చారు. వీటికోసం వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. మార్కెట్లో వీటికి ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారస్తులు మత్స్యకారులతో బేరసారాలు సాగించారు. ఒక చేప ధర దాదాపు లక్ష రూపాయలకు పైనే ఉంటుంది అని స్థానికులు చెబుతున్నారు.
వ్యాపారులు లక్షలు చెల్లించి ఆ చేపలను సొంతం చేసుకున్నారు. వాటిని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే వాటికి అంత డిమాండ్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com