AP: మహిళను మంటల్లోకి తోసేసిన వైసీపీ నేత

AP: మహిళను మంటల్లోకి తోసేసిన వైసీపీ నేత
బరితెగిస్తున్న వైసీపీ నాయకులు... మండిపడ్డ నారా లోకేశ్‌

ఏపీలో వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. విశాఖ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలోని 65 వార్డులో నివాసం ఉంటున్న వివాహితపై... వైసీపీ నాయకుడి హత్యాయత్నం ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విశాఖ గాజువాకలో ఒంటరి మహిళపై వైసీపీ నేత హత్యాయత్నం... ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు కాలిన గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా నిందితులను రక్షించేందుకు యత్నిస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. జలుమూరి రాధ అనే మహిళ ఇంటికి కుళాయి వేయిస్తానని... 65వ వార్డు వైసీపీ అధ్యక్షుడు లోకనాథం 20వేలు తీసుకున్నాడని బాధితురాలి బంధువులు తెలిపారు. నెలలు గడుస్తున్నా పని కాకపోవడంతో ఆమె నిలదీసిందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థలానికి పట్టా ఇప్పిస్తా మరో 50 వేలు ఇవ్వాలని లోకనాథం అడిగినా... రాధ ఇవ్వలేదన్నారు. కక్ష పెంచుకున్న లోకనాథం ఆ స్థలంలో ఉన్న రేకులు, ఐరన్ రాడ్లు తీసేశారని... దీనిపై బాధితురాలు న్యూ పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీనిపై సీఐ చర్యలు తీసుకోకపోవడంతో... ఫిబ్రవరి 26న సీపీ స్పందన కార్యక్రమంలో బాధితురాలు ఫిర్యాదు చేశారన్నారు. ఆ ఫిర్యాదు మళ్లీ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ వద్దకే వచ్చిందన్నారు.

ఇదే సమయంలో ఈనెల 11న లోకనాథం కుటుంబసభ్యులు.. రాధ ఇంటికి పొరుగున వున్న అరుణ అనే మహిళ స్ధలంలోకి వచ్చి కబ్జాకు యత్నంచారు. సదరు స్ధలంలో ఉన్న కంపకు పెట్రోలు పోసి నిప్పుపెట్టి ఖాళీ చేయించేందుకు యత్నించగా... ఆ మహిళకు రాధ అండగా నిలబడింది. దీంతో రాధను లోకనాథం మంటోల్లోకి తోసేశాడు. ఈ అమానవీయ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖం కాలి.. చర్మం ఊడిపోయింది. ఎడమచేతికి ఫ్రాక్చరైంది. స్థానికులు ఆమెను కేజీహెచ్‌కు తరలించారు.. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు... నిందితులపై హత్యాయత్నం కేసు పెట్టకుండా నామమాత్రపు సెక్షన్లు పెట్టారని రాధ బంధువులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుడికి అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు రాధను తెలుగుదేశం నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. విశాఖలో వైసీపీ అఘాయిత్యాలకు అడ్డే లేకుండా పోయిందని మండిపడ్డారు. జలుమూరి రాధపై వైసీపీ నాయకుడి పెట్రోల్ దాడి యత్నం దారుణం అని విమర్శించారు. జగన్ పాలనలో సొంత తల్లి, చెల్లికే రక్షణ లేదని పేర్కొన్నారు. ఇంటి పట్టాకు లంచం ఎందుకివ్వాలని ప్రశ్నిస్తే దాడి చేస్తారా? అని లోకేశ్ నిలదీశారు. వైసీపీ నేత లోకనాథంను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story