Gold Bonds: ఈ ప్రభుత్వ పథకం ద్వారా కొనుగోలు చేస్తే.. తక్కువ ధరలో బంగారం
Gold Bonds: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్లోని పదో సిరీస్లో ఫిబ్రవరి 28 - మార్చి 4, 2022 మధ్య బంగారంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. తక్కువ ధరలో బంగారాన్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ అవకాశాన్ని కోల్పోకండి. మార్కెట్ కంటే తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ బంగారు బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, పదో సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఇష్యూ ధర గ్రాముకు రూ. 5,109గా నిర్ణయించబడింది. ఇంతకుముందు, 9వ సిరీస్ ధరలు గ్రాముకు రూ.4,786గా ఉన్నాయి.
ఇక ఈ బాండ్లను ఆన్లైన్లో కొనుగోలు చేస్తే, గ్రాముకు రూ. 50 తగ్గింపు ప్రయోజనం కూడా పొందవచ్చు. ఈ ప్రయోజనాన్ని పొందడానికి డిజిటల్ మోడ్లో నగదు చెల్లించాలి. ఆన్లైన్ చెల్లింపు చేస్తే, బంగారు బాండ్ ఇష్యూ ధర గ్రాముకు రూ. 5,059 అవుతుంది.
ఈ బాండ్ని కొనుగోలు చేసినట్లయితే, దానితో వడ్డీ ప్రయోజనం కూడా పొందుతారు. ఇష్యూ ధరపై 2.5 శాతం వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు.
ఈ బాండ్లను ఎలా కొనుగోలు చేయాలి?
బాండ్ల కొనుగోలు విషయానికి వస్తే, పెట్టుబడిదారులు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL), పోస్ట్ ఆఫీస్ లేదా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలు, NSE మరియు BSE ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఎంత బంగారం కొనుగోలు చేయవచ్చు?
గరిష్టంగా 4 కిలోల బంగారు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు లేదా సంస్థలు అయితే 20 కిలోల వరకు బాండ్లను కొనుగోలు చేయవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏమిటి?
సావరిన్ గోల్డ్ బాండ్ అనేది RBI జారీ చేసే ఒక రకమైన ప్రభుత్వ బాండ్. ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. బంగారం బరువుతో సమానంగా కొనుగోలు చేయవచ్చు. 5 గ్రాముల బాండ్ 5 గ్రాముల బంగారంతో సమానమైన ద్రవ్య విలువను కలిగి ఉంటుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com