Chandrayaan-3 : చంద్రయాన్ పై సోషల్ మీడియాలో పోస్టు.. ప్రకాష్ రాజ్‌ పై కేసు నమోదు

Chandrayaan-3 : చంద్రయాన్ పై సోషల్ మీడియాలో పోస్టు.. ప్రకాష్ రాజ్‌ పై కేసు నమోదు
చంద్రయాన్-3 మిషన్‌ను 'మాకింగ్' చేసినందుకు ప్రకాష్ రాజ్‌ పై కేసు నమోదు

దేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌ను అపహాస్యం చేసినందుకు గాను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌పై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన చంద్రయాన్ 3పై సోషల్ మీడియాలో చేసిన పోస్టు నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌పై కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు నివేదికలు తెలిపాయి. చంద్రయాన్-3 మిషన్‌కు వ్యతిరేకంగా పోస్టు చేసినందుకు నటుడు ప్రకాష్ రాజ్‌పై ఫిర్యాదు నమోదైందని పోలీసులు తెలిపారు. బాగల్‌కోట్ జిల్లా బనహట్టి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై హిందూ సంస్థల నాయకులు ఫిర్యాదు చేశారని, ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారని పలు నివేదికలు తెలిపాయి.

అంతకుముందు ఆగస్టు 20న మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో.. చొక్కా, లుంగీలో టీ పోస్తున్న వ్యక్తి వ్యంగ్య చిత్రాన్ని ప్రకాష్ రాజ్ పంచుకున్నారు. దాంతో పాటు "చంద్రయాన్ నుండి మొదటి చిత్రం వచ్చింది.. #VikramLander #justasking." అంటూ క్యాప్షన్ లో రాసుకువచ్చారు. చంద్రయాన్-3 మిషన్ దేశానికి గర్వకారణం అని అంతా భావిస్తున్న ఈ సమయంలో ప్రకాష్ రాజ్‌కి ఇలా పోస్టు చేయడం దేశ ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని కలగజేసింది. ఆ తర్వాత ఆయనపై సోషల్ మీడియాలో పలు ట్రోల్స్, విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఈ విమర్శలపై స్పందించిన ప్రకాష్ రాజ్ తన వ్యాఖ్యలు కేవలం జోక్ కోసం మాత్రమే ఉద్దేశించినవి అని ఎక్స్‌లో స్పష్టం చేశారు. "ద్వేషం ద్వేషాన్ని మాత్రమే చూస్తుంది...నేను #ఆర్మ్‌స్ట్రాంగ్ టైమ్స్ సెలబ్రేట్ చేస్తున్న మన కేరళ చాయ్‌వాలా-ఏ చాయ్‌వాలాను ట్రోల్‌లు చూశారు? మీకు జోక్ రాకపోతే ఆ జోక్ మీదే..GROW UP #justasking" అని ప్రకాష్ రాజ్ పోస్ట్ ద్వారా తెలియజేశారు.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రకారం, చంద్రయాన్-3 ఆగస్టు 23న, దాదాపు 6:04 గంటలకు IST చంద్రునిపై ల్యాండ్ కానుంది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ ఘనత సాధించిన నాల్గవ దేశంగా భారత్ నిలవనుంది. అయితే చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ఏకైక దేశం భారత్ మాత్రమే కానుంది.

చంద్రయాన్-3 మిషన్ ప్రాథమిక లక్ష్యాలు ముఖ్యంగా-- చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన, మృదువైన ల్యాండింగ్‌ను ప్రదర్శించడం; చంద్రునిపై రోవర్ తిరుగుతున్నట్లు ప్రదర్శించడానికి, శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించడం. ఇదిలా ఉండగా చంద్రయాన్-3 అభివృద్ధి దశ జనవరి 2020లో ప్రారంభమైంది. 2021లో ప్రయోగాన్ని ఎప్పుడో ప్లాన్ చేశారు. అయితే, కొవిడ్-19 మహమ్మారి మిషన్ పురోగతికి ఊహించని జాప్యాన్ని తెచ్చిపెట్టింది. ఎట్టకేలకు చంద్రయాన్-3 మిషన్‌ను జూలై 14, 2023న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి మధ్యాహ్నం 2:35 గంటలకు GSLV మార్క్ 3 (LVM 3) హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించారు.


Tags

Read MoreRead Less
Next Story