Bigg Boss OTT Telugu: మొన్న దీప్తి.. నిన్న షణ్నూ.. నేడు వైష్ణవి చైతన్య..
vaishnavi chaitanya (tv5news.in)
Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ రియాలిటీ షోకు రోజురోజుకీ క్రేజ్ పెరిగిపోతుండడంతో ఆ షో యాజమాన్యం కూడా వినూత్న ఐడియాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తోంది. అందులో ఒక ఐడియానే బిగ్ బాస్ ఓటీటీ. సాధారణంగా రోజుకి 24 గంటలు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోనే ఉంటారు. కానీ అందులో గంట మాత్రమే మనకు టీవీ టెలికాస్ట్ చేస్తారు. అలా కాకుండా కంటెస్టెంట్స్ను 24 గంటలు చూపించేదే బిగ్ బాస్ ఓటీటీ.
బిగ్ బాస్ ఓటీటీ అనేది కేవలం ఓటీటీ ప్లాట్ఫార్మ్లోనే టెలికాస్ట్ అవుతుంది. ఇంతకు ముందు లాగా టీవీల్లో రాదు. ఇప్పటికే హిందీలో బిగ్ బాస్ ఓటీటీ ఓ సీజన్ను పూర్తిచేసుకుంది. అదే ఐడియా త్వరలో తెలుగులో కూడా రానుంది. తెలుగులో బిగ్ బాస్ ఓటీటీ త్వరలోనే ప్రారంభం కానుందన్న విషయాన్ని స్వయంగా హోస్ట్ నాగార్జుననే ప్రకటించాడు. అయితే ఈ బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్స్ ఎవరు అనేదానిపై పెద్ద చర్చే సాగుతోంది.
బిగ్ బాస్ మొదలయినప్పటి నుండి ప్రతీ సీజన్లో ఓ సోషల్ మీడియా స్టార్ కచ్చితంగా ఉంటున్నారు. అలా దీప్తి సునైనా, మహబూబ్ దిల్సే, ఇటీవల షణ్మూ లాంటి వారు బిగ్ బాస్ ద్వారా వారికి ఉన్న పాపులారిటీని మరింత పెంచుకున్నారు. అదే తరహాలో బిగ్ బాస్ ఓటీటీలోకి సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య రానున్నట్టు సమాచారం. పలు షార్ట్ ఫిల్మ్స్తో, షణ్నూతో కలిసి చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్తో మంచి గుర్తింపును అందుకున్న వైష్ణవి.. త్వరలోనే బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
వైష్ణవి చైతన్యతో పాటు పలువురు పేర్లు కూడా బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్స్గా వినిపిస్తున్నాయి. అందులో యాంకర్ వర్షిణి, 'ఢీ' డ్యాన్సర్ రాజు, యూట్యూబ్ యాంకర్ శివ కూడా ఉన్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. బిగ్ బాస్ ఓటీటీ కేవలం హాట్స్టార్లోనే ప్రచారం అవ్వడానికి సిద్ధమవుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com