దైవదర్శనం : కోరిన మొక్కులు తీర్చే ఎములాడ రాజన్న!

దైవదర్శనం : కోరిన మొక్కులు తీర్చే ఎములాడ రాజన్న!
రాజరాజేశ్వరస్వామి ఆలయంగా, భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా, అత్యంత పుణ్యక్షేత్రంగా ప్రసిద్దికెక్కింది ఈ ఆలయం.. దక్షిణ కాశీగా ఈ ఆలయానికి మరో పేరు కూడా ఉంది.

రాజరాజేశ్వరస్వామి ఆలయంగా, భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా, అత్యంత పుణ్యక్షేత్రంగా ప్రసిద్దికెక్కింది ఈ ఆలయం.. దక్షిణ కాశీగా ఈ ఆలయానికి మరో పేరు కూడా ఉంది. కోడె మొక్కుల స్వామిగా, ఎములాడ రాజన్నగా, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరు గాంచాడు ఈ వేములవాడ రాజరాజేశ్వరస్వామి.. శివ కేశవులు ఒక్కటేనన్న భావంతో పాటు, హిందూ ముస్లిం అనే సౌభ్రాతృత్వం ఈ ఆలయంలో మనకి కనిపిస్తుంది. ఆ ఆలయ విశేషాలే ఈనాటి మన దైవదర్శనం..

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత శైవ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది ఈ వేములవాడ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన ఈ పుణ్యక్షేత్రం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో రాజన్నసిరిసిల్లా జిల్లాలోకి వెళ్ళింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 160 కిలోమీటర్లు, కరీంనగర్‌కు 36 కిలోమీటర్ల దూరంలో వున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకున్నది.


స్థలపురాణం :

అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఈ ఆలయానికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. ఆ కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం చెపుతుంది.

ఆలయ విశేషాలు :

మహాశివరాత్రి రోజున సుమారుగా మూడు లక్షలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది.


♦ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఈ వేములవాడ ఒకటి. గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి రూ. 8 లక్షలు ఖర్చు పెడితుంది ఈ దేవస్థానం.

♦ కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం లను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వేంచేసాడని పురాణ కథనం.

♦ ఈ ఆలయంలో స్వామివారికి కుడి పక్కన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి.

♦ ఈ ఆలయంలో కోడె మొక్కుకి ఎంతో ప్రాధాన్యత ఉంది, కోడెలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టివేస్తారు. దీనివలన భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే గండ దీపాన్ని వెలిగించడం ఈ అలయంలో ఉన్న మరో ప్రత్యేకత!



♦ శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు.

♦ దేవాలయ ప్రాంగణంలో 100 ఏళ్ళ నాటి మసీదు ఉంది. ఇస్లాం మతానికి ఏమండీ చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్ళో ఉంటూ, స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట. అతని స్మృత్యర్ధం ఈ మసీదు నిర్మించారని స్థలపురాణం చెపుతుంది.

♦ దేవాలయ ప్రాంగణంలో కోటి శివలింగాలు ఉంటాయి.

♦ ఈ ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ నుంచి నేరుగా రవాణా సౌకర్యాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story