Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దూకుడు పెంచిన సీబీఐ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దూకుడు పెంచిన సీబీఐ
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో మరోకరిని అరెస్టు చేసింది. బోయినపల్లి అభిషేక్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు సీబీఐ వెల్లడించింది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో మరోకరిని అరెస్టు చేసింది. బోయినపల్లి అభిషేక్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. అభిషేక్‌ను కోర్టులో హాజరుపరచనుంది సీబీఐ. అభిషేక్‌ రాబిన్ డిస్టిలరీస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి ఇదే తొలి అరెస్టు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసుకు సంబంధించి కొన్ని రోజులుగా ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌, సీబీఐ సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో కీలక ఆధారాలు సేకరించాయి. ఈ కేసులో ఇప్పటికే విజయ్‌ నాయర్‌, సమీర్ మహేంద్రు అరెస్టయ్యారు. అభిషేక్‌తో ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టుల సంఖ్య 3 కు చేరింది.

లిక్కర్‌ స్కామ్‌లో ఢిల్లీ సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో హైదరాబాద్‌ నుంచి అరుణ్‌ రామచంద్ర పిళ్లై, అభిషేక్‌రావు పేర్లు కూడా ఉన్నాయి.. అభిషేక్‌రావు, రామచంద్ర పిళ్లైని సీబీఐ ఇప్పటికే పలుమార్లు విచారించింది.. లిక్కర్‌ స్కామ్‌ విచారణలో అభిషేక్‌ నేరం ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు.. తెల్లవారుజామున అభిషేక్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సీబీఐ.. ఆ వెంటనే ఢిల్లీ తరలించింది.

లిక్కర్‌ స్కామ్‌లో ఇప్పటికే ఇండో స్పిరిట్స్‌ ఓనర్‌ అయిన సమీర్ మహేంద్రుని ఈడీ అరెస్ట్ చేయగా.. విజయ్ నాయర్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. 2021-22 కొత్త ఎక్సైజ్ పాలసీని తయారు చేస్తున్నప్పుడు మార్పులు చేయడంలో కీలక పాత్ర పోషించారని సమీర్‌పై ఆరోపణలు ఉన్నాయి. సమీర్‌ దినేష్ అరోరా అకౌంట్‌కు కోటి రుపాయిలు బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. దినేష్ అరోరా, ఢిల్లీ డిప్యూటి సీఎం మనీష్ సిసోడియాకు సన్నిహితుడు... అరోరా లాబియింగ్‌తో సిసోడియాకు లాభం చేకూరిందని ఈడీ,సీబీఐ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి శుక్రవారం హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ సోదాలు జరిగాయి. జూబ్లిహిల్స్‌, కూకట్‌పల్లి,. మరో రెండు చోట్ల అధికారులు తనిఖీలు చేశారు.

ఢిల్లీలో గతేడాది నవంబర్‌లో కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకువచ్చింది. ఐతే ఈ విధానంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో జులైలో ఈ విధానాన్ని కేజ్రీవాల్ సర్కార్ వెనక్కి తీసుకుంది. ఐతే జరిగిన ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి సిఫార్సు చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కె. సక్సెనా. దీంతో రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థలు దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story