దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ఇప్పటికే మొదలైందా...!

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ఇప్పటికే మొదలైందా...!
మరోవైపు దేశంలో 73 జిల్లాల్లో ‘పాజిటివిటీ’ రేటు 10 శాతానికిపైగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇది వైరస్‌ ఉధృతికి అద్దం పడుతోంది.

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో...దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ఇప్పటికే మొదలైందా అన్న అనుమానం కల్గుతోంది. గత రెండు వారాల కొవిడ్‌ కేసుల గణాంకాలు చూస్తే... ఔననే సమాధానమే లభిస్తోంది. 55 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా ఈనెల 7 నుంచి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య పెరగటం ప్రారంభమైంది. ఆ ఒక్క రోజునే కొత్తగా 784 యాక్టివ్‌ కేసులు నమోదు అయ్యాయి. జూలై 14 నాటికి సరిగ్గా వారంలోనే మరో 2,095 కొత్త యాక్టివ్‌ కేసులను గుర్తించారు. వారం వ్యవధిలోనే.. రోజువారీ యాక్టివ్‌ కేసులు 3 రెట్లు పెరిగాయని స్పష్టమవుతోంది.

మరోవైపు దేశంలో 73 జిల్లాల్లో 'పాజిటివిటీ' రేటు 10 శాతానికిపైగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇది వైరస్‌ ఉధృతికి అద్దం పడుతోంది. ఐసీఎంఆర్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశంలో డెల్టా వేరియంట్‌ ప్రాబల్యం అత్యధికంగా ఉందని తేలింది. దీనివల్లే కొత్త కేసుల్లో మళ్లీ పెరుగుదల నమోదవుతోందని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోజువారీ కొత్త కేసుల్లో తగ్గుదల నెమ్మదించడాన్ని ప్రమాద ఘంటికలుగా పరిగణించాలని...నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ చేసిన ప్రకటన కూడా...థర్డ్‌వేవ్ ఇప్పటికే మొదలైందనే దిశగానే సంకేతాలిస్తోంది.

ఇది ఇలా ఉండగా... కొవిడ్‌ ఆసుపత్రుల్లో అడ్మిషన్లు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్‌ వ్యాప్తిలో థర్డ్‌ వేవ్‌ ఉండొచ్చన్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలో... ఆసుపత్రుల్లో చేరికల పెరుగుదల వైద్య వర్గాలను కలవరపెడుతోంది. కేసులు తగ్గుతున్నాయన్న ఉద్దేశంతో కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చినా... ప్రజలు కనీస జాగ్రత్తలను పాటించికపోవటం, ముఖ్యకూడళ్లలో రద్దీ, మాస్కులు ధరించకపోవటం, భౌతికదూరమే లేకపోవటంతో... ప్రమాదం పొంచిఉందన్న అనుమానం కల్గుతోంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరేవారు, డిశ్ఛార్జి అయ్యేవారి సంఖ్యలో వ్యత్యాసం తగ్గుతుండటం ఆందోళన కల్గిస్తోంది. కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా ఉన్నప్పుడు కేసులు తగ్గటమేగాక... డిశ్ఛార్జిలు బాగా పెరిగినట్లు వైద్యులు వెల్లడించారు.

ఏపీలోనూ... కరోనాతో రోజువారిగా ఆస్పత్రుల్లో చేరుతున్నవారు స్వల్పంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. విజయవాడ జీజీహెచ్‌లో ఒక్కొక్క రోజు 15 నుంచి 30 మంది బాధితులు చేరుతున్నారు. అటు విశాఖ కేజీహెచ్‌లో కొత్తగా చేరేవారు, ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి వారి సంఖ్య దాదాపుగా సమానంగా ఉంటోందన‌్న... సూపరింటెండెంట్‌..'కర్ఫ్యూ అమలు వేళ కేసులు తగ్గినట్లు వెల్లడించారు. కాకినాడ జీజీహెచ్‌కు ఆక్సిజన్‌ ఇబ్బందులతో ... ఎక్కువగా మంది బాధితులు వస్తున్నారన్న వైద్యులు...ఈనెల12న ఆక్సిజన్‌ 7 KL వాడకం ఉండగా..ప్రస్తుతం పెరిగినట్లు పేర్కొన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో కరోనా అనుమానిత లక్షణాలతో ఇంతకుముందు ఓపీకి 50 మంది వరకు రాగా ..ప్రస్తుతం వందమంది వరకు చేరుతున్నారని......ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరిగినట్లు వైద్యుల వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story