NO Cash..Only Fastag.. ఫాస్టాగ్ లేకపోతే రెట్టింపు ఫీజు వసూలు

NO Cash..Only Fastag.. ఫాస్టాగ్ లేకపోతే రెట్టింపు ఫీజు వసూలు
జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనాలకు Fastag‌ లేకపోతే రెట్టింపు టోల్ ఫీజులు వసూలు చేయనున్నారు.

ఇకపై టోల్ ఫీజు చెల్లించే విధానానికి తెరపడనుంది. నేటి అర్థరాత్రి నుంచి ఫాస్టాగ్‌ నిబంధన పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇక మీదట జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్‌ లేకపోతే రెట్టింపు టోల్ ఫీజులు వసూలు చేయనున్నారు. ఫాస్టాగ్‌ గడువును ఇక పొడిగించేది లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే వాహనాల్లో ఇప్పటికే 90శాతం ఫాస్టాగ్‌ను వాడుతున్నాయన్నారు.

ఒకవేళ ఫాస్టాగ్‌ లేకుంటే.. రెట్టింపు చెల్లింపుతో పాటు 24 గంటల్లోనే తిరుగు ప్రయాణమైతే ఇచ్చే సగం రాయితీ కూడా లభించదు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 1 నుంచే ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా.. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఈనెల 15 వరకు పొడిగించింది. ఇంతకు ముందు ప్రతి టోల్‌ప్లాజా వద్ద ఒక లేన్‌ను నగదు చెల్లింపుల కోసం కేటాయించేవారు. ఇకపై అన్ని లైన్లలో ఫాస్టాగ్ తప్పనిసరిగా ఉంటుంది.

జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ విక్రయాలకు తాత్కాలిక కేంద్రాలు ఏర్పాటుచేశారు. వాహనదారులు తమ వాహనం వివరాలు అందజేసి, ఫాస్టాగ్‌ను తీసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలు, ఫోన్‌పే వంటి మనీ వ్యాలెట్‌ సంస్థ కూడా ఫాస్టాగ్‌ విక్రయాలు జరుపుతున్నాయి. మరోవైపు గుర్తింపు పొందిన బ్యాంకులు కూడా వీటిని అందజేస్తున్నాయి. ఫాస్టాగ్‌లో మినిమం అమౌంట్ ఉండాలనే నిబంధనను కేంద్రం ఎత్తివేసింది. అయితే డబ్బులు లేకుండా ఫాస్టాగ్‌ను వాడితే బ్లాక్‌లిస్టులోకి మారిపోతుంది. దీంతో వాహనదారుడు రెట్టింపు టోల్‌ చెల్లించాల్సి ఉంటుంది.

కేంద్రం ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద నో క్యాష్.. ఓన్లీ ఫాస్టాగ్ అంటూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు.


Tags

Read MoreRead Less
Next Story