'Noorjahan': 'నూర్జహాన్' .. ఒక్కో మామిడి పండు వెయ్యి రూపాయలంట..
'Noorjahan': పండ్లలో రారాజు మామిడి పండు అని తెలుసు కానీ ఎంత రాజైతే మాత్రం ఇంత రేటు పెట్టి కొని ఎవరి తింటారు బాబు అంటే.. లేకేం ఉన్నారు. వీటికి డిమాండ్ మామూలుగా లేదండి.. అందుకే ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ కాయలు సప్లై చేస్తున్నాము అంటున్నారు రైతులు. మామిడి పండ్లలో చాలా రకాలు ఉంటాయి.
దేని రుచి దానిదే. ఇప్పుడు కొత్తగా వింటున్న ఈ నూర్జహాన్ రకం మామిడి పండు ఆప్ఘన్ మూలాలకు చెందినది. ఈ మామిడి పంటను దేశంలోని గుజరాత్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న అలీరాజ్పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతంలో సాగు చేస్తున్నారు. ఇది ఇండోర్ నుండి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఈ పంటను సాగు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో పండించిన ' నూర్జహాన్ ' మామిడి గత సంవత్సరంతో పోల్చితే మంచి దిగుబడి వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పండు పరిమాణం కారణంగా అధిక ధరను పొందుతోంది. ఈ సీజన్లో ' నూర్జహాన్' మామిడి ధర రూ .500 నుంచి రూ .1,000 వరకు ఉంటుందని గత ఏడాది మాదిరిగా కాకుండా, అనుకూలమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రకమైన మామిడి పండ్ల దిగుబడి ఈసారి బాగానే ఉందని రైతులు చెబుతున్నారు.
నా పండ్ల తోటలోని మూడు నూర్జహాన్ మామిడి చెట్లు 250 మామిడి పండ్లను ఉత్పత్తి చేశాయి. పండ్ల ధర ఒక్కో కాయకు రూ. 500 నుండి రూ. 1,000 వరకు ఉంది. ఈ మామిడి పండ్ల కోసం ఇప్పటికే బుకింగ్లు జరిగాయి" అని కత్తివాడకు చెందిన మామిడి సాగు రైతు శివరాజ్ సింగ్ జాదవ్ చెప్పారు.
'నూర్జహాన్' మామిడి పండ్లను ముందుగానే బుక్ చేసుకున్న వారిలో మధ్యప్రదేశ్తో పాటు పొరుగున ఉన్న గుజరాత్కు చెందిన పండ్ల ప్రేమికులు ఉన్నారు. "ఈసారి నూర్జహాన్ మామిడి బరువు 2 కిలోల నుండి 3.5 కిలోల మధ్య ఉంది" అని జాదవ్ తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com