15th President of India: 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసలు పేరు.. ఎవరు పెట్టారంటే..
Droupadi Murmu : కొంతకాలం క్రితం ఓడియా వీడియో మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, "ద్రౌపది నా అసలు పేరు కాదు. ఇది నా గురువు పెట్టిన పేరు" అని ముర్ము పత్రికకు చెప్పారు. గిరిజనులు అధికంగా ఉండే మయూర్బంజ్ జిల్లాలోని ఉపాధ్యాయులు 1960లలో బాలాసోర్ లేదా కటక్ నుండి ప్రయాణించేవారు. 'మహాభారతం' లోని పాత్ర పేరు ద్రౌపది. ఆపేరు ఎందుకు పెట్టారని పత్రిక అడిగినప్పుడు, "మా టీచర్కు నా పేరు 'పుతి' నచ్చలేదు. దాంతో ఆమె నా పేరును ద్రౌపదిగా మార్చారు అని వివరించారు.
సంతాలీ సంస్కృతిలో పేర్లు చావవని ఆమె పేర్కొన్నారు. "ఒక ఆడపిల్ల పుడితే, ఆమె తన అమ్మమ్మ పేరుతో పిలవబడుతుంది. ఒక కొడుకు పుడితే వాడికి తాత నామకరణాన్ని వారసత్వంగా కలిగి ఉంటాడు," ఆమె చెప్పారు.
పాఠశాలలు మరియు కళాశాలలలో టుడు అనే ఇంటిపేరు ఉన్న ద్రౌపది, బ్యాంక్ అధికారి అయిన శ్యామ్ చరణ్ ముర్ముని వివాహం చేసుకున్న తర్వాత ద్రౌపది ముర్ముగా మారిపోయారు. భారత 15వ రాష్ట్రపతిగా ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమెచేత ప్రమాణ స్వీకారం చేయించారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నిక కావడానికి చాలా ముందు ముర్ము రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్పై తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. ''పురుషులు ఆధిపత్యం వహించే రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి. రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎన్నుకోవడం మరియు ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్లు పంపిణీ చేయడం ద్వారా ఈ పరిస్థితిని మార్చవచ్చు, "అని ఆమె తెలిపారు.
మరో ఇంటర్వ్యూలో, ముర్ము తన 25 ఏళ్ల పెద్ద కుమారుడు లక్ష్మణ్ మరణం తర్వాత తనకు ఎదురైన కష్టాలను వివరించారు. "నా కొడుకు మరణంతో నేను పూర్తిగా కృంగిపోయాను. దాదాపు రెండు నెలలు నేను డిప్రెషన్లో ఉన్నాను. ప్రజలను కలవడం మానేసి ఇంటికే పరిమితమయ్యాను. తరువాత నేను ఈశ్వరీయ ప్రజాపతి బ్రహ్మకుమారిలో చేరాను, యోగా మరియు ధ్యానం చేశాను" దాంతో నా ఆలోచనల్లో కొంచెం మార్పు వచ్చింది. నేను ఉన్నంతకాలం ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని అనుకున్నాను. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాను అని ఆమె తెలిపారు.
భారతదేశ 15వ రాష్ట్రపతి 2013లో రోడ్డు ప్రమాదంలో తన చిన్న కుమారుడు సిపున్ను కోల్పోయారు. అనంతరం కొద్ది రోజులకే ఆమె సోదరుడు, తల్లి మరణించారు. "నేను నా జీవితంలో సునామీని ఎదుర్కొన్నాను ఆరు నెలల వ్యవధిలో నా కుటుంబ సభ్యులు మూడు మరణాలను చూశాను" అని ముర్ము ఆవేదనతో చెప్పారు, ఆమె భర్త శ్యామ్ చరణ్ కూడా అనారోగ్యంతో 2014 లో మరణించారు.
"నేను కూడా ఎప్పుడైనా చనిపోతాను. జీవితంలో దుఃఖం, ఆనందం ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. అయిన వారందరినీ కోల్పోయినప్పుడు ఆ బాధను ఎవరూ తీర్చలేరు. ఒంటరిగా రోధించిన రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నారు ముర్ము.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com