Tamilnadu : రజినీకాంత్ కూతురి ఇంట్లో చోరీ..!

Tamilnadu : రజినీకాంత్ కూతురి ఇంట్లో చోరీ..!

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురి ఇంట్లో చోరీ జరిగింది. ఐశ్వర్య రజినీకాంత్ తన ఇంట్లో రూ. 3.60 లక్షల విలువైన నగలు మయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైలోని తన లాకర్‌లోని 60 సవర్ల బంగారు, వజ్రాభరణాలు మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019లో తన సోదరి సౌందర్య వివాహానికి వాటిని ధరించినట్లు చెప్పారు. ఆభరణాలను లాకర్ లో ఉంచినట్లు తెలిపిన ఐశ్వర్య... లాకర్ గురించి తన ఇంట్లోని పనివాళ్లకు, డ్రైవర్ కు తెలుసని తెలిపారు. తేనంపేట పోలీసులు ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

లాకర్‌ను 2021లో మూడు ప్రదేశాలకు మార్చినట్లు తెలిపారు. ఆగస్టు 21, 2021న, లాకర్‌ని ఆమె మాజీ భర్త ధనుష్‌కి చెందిన సిఐటి నగర్‌లోని ఫ్లాట్‌ కు ఇతర గృహోపకరణాలతో పాటు తీసుకెళ్లారు. సెప్టెంబర్ 2021లో, చెన్నైలోని సెయింట్ మేరీస్ రోడ్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌కు తిరిగి తీసుకొచ్చారు. ఏప్రిల్ 2022లో లాకర్ ను, పోయెస్ గార్డెన్ నివాసానికి మార్చారు, లాకర్ కీలు సెయింట్ మేరీస్ రోడ్‌లోని ఆమె ఫ్లాట్‌లో ఉన్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 10, 2023న ఐశ్వర్య లాకర్‌ని తెరిచి చూడగా.. రూ.3.60 లక్షల విలువైన డైమండ్ సెట్లు, నవరత్నం సెట్లు, గాజులు, దాదాపు 60 సవర్ల బంగారం చోరీకి గురయినట్లు తెలిపారు. ఫిర్యాదులో, ఐశ్వర్య.. తన పనిమనిషి ఈశ్వరి, లక్ష్మి, డ్రైవర్ వెంకట్‌లను అనుమానిస్తున్నట్లు రాసింది, తాను ఇంటికి దూరంగా ఉన్నప్పుడు కూడా సెయింట్ మేరీస్ రోడ్‌లోని తన అపార్ట్‌మెంట్‌కు పనివాళ్లు తరచూ వెళ్లేవారని పేర్కొన్నారు ఐశ్వర్య.

Tags

Read MoreRead Less
Next Story