కేంద్ర కేబినెట్‌లో భారీ ప్రక్షాళన... ఉహించని మార్పులు..!

కేంద్ర కేబినెట్‌లో భారీ ప్రక్షాళన... ఉహించని మార్పులు..!
వచ్చే ఏడాది పలు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలే కాదు.. ఏకంగా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని మోదీ భారీ కసరత్తే చేసినట్లు కనిపిస్తోంది.

వచ్చే ఏడాది పలు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలే కాదు.. ఏకంగా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని మోదీ భారీ కసరత్తే చేసినట్లు కనిపిస్తోంది. పనితీరు సరిగాలేని మంత్రుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించారు. అయితే వారి అనుభవం, సేవలను పార్టీపరంగా ఉపయోగించుకుంటారని తెలుస్తోంది. ప్రమోషన్‌ పొందిన ఏడుగురు మంత్రులతోపాటు కొత్తగా బెర్త్ దక్కించుకున్న 36 మంది అంటే మొత్తం 43 మంది రాష్ట్రపతిభవన్‌లోని దర్బార్‌హాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు.

ఇక పనితీరు సంతృప్తికరంగా మరో ఏడుగురు సహాయ మంత్రులకు ప్రమోషన్ లభించింది. వీరికి కేబినెట్ బెర్త్ ఖరారు చేశారు. హర్దీప్ సింగ్ పురి, ఆర్కే సింగ్, కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి, పురుషోత్తం రూపాల, మన్సుఖ్ భాయ్ మండ్వియాకు కేబినెట్ ర్యాంక్ దక్కింది...కిషన్‌ రెడ్డి ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. ఆయనకు కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి కల్పించారు.

హిమాచల్‌ప్రదేశ్‌ ఎంపీ అయిన అనురాగ్‌ ఠాకూర్‌ ప్రస్తుతం ఆర్థికశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఆయనకు ప్రమోషన్ లభించింది. పాటు వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా హర్‌దీప్‌ సింగ్‌ పూరికి కేబినెట్‌ హోదా ఇచ్చారు..ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయ పార్టీ బలోపేతం చేసే దిశగా కిరణ్‌ రిజిజును కేబినెట్‌లోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన క్రీడల శాఖకు సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇక గుజరాత్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సహాయ మంత్రులకు కేబినెట్‌ హోదా కల్పించారు. పంచాయతీ రాజ్‌ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా, పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మనుసుఖ్‌ మాండవీయను కేబినెట్‌లోకి తీసుకున్నారు.

పలువురు సీనియర్ మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికారు. రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, సదానందగౌడ, హర్షవర్ధన్ వంటి సీనియర్ మంత్రులను తొలగించారు. రమేష్ ఫోక్రియాల్, సంతోష్ గంగ్వార్ , దేబాశ్రీచౌధురి, బాబుల్ సుప్రియో, సంజయ్ శామ్‌రావ్, రతన్‌ లాట్ కటారియా , ప్రతాప్ చంద్ర సారంగి, తావర్ చంద్ గెహ్లాట్ రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. వీరంతా తమ రాజీనామా లేఖలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపారు.

కేంద్ర న్యాయ, ఐటీశాఖ మంత్రిగా ఉన్న రవిశంకర్‌ ప్రసాద్‌ ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టంపై ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాలతో తలపడ్డారు. అలాగే, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్న ప్రకాశ్‌ జావడేకర్‌ రాజీనామాను పెద్ద సర్‌ప్రైజ్‌గానే రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు, కరోనా సెకండ్‌వేవ్‌ను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యంపై గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, పడకల కొరతతో పాటు వ్యాక్సినేషన్‌ విధానంపైనా విమర్శలు వచ్చిన నేపథ్యంలో హర్షవర్దన్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే, అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకొంటున్నట్టు రమేశ్‌ పోఖ్రియాల్‌ స్పష్టంచేశారు.

జంబో కేబినెట్ కూర్పులో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ అవసరాలు, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు. మొత్తం 12 మంది ఎస్సీల్లో ఎనిమిది మందికి కేబినెట్ హోదా కల్పించారు. కేంద్ర మంత్రుల సగటు వయసు 58 సంవత్సరాలుగా ఉంది. ఇక కేబినెట్‌లో 50ఏళ్ల లోపు వయస్సు ఉన్న 14మంది మంత్రులు ఉండగా.. ఇందులో ఆరుగురికి కేబినెట్ హోదా దక్కింది..కేంద్ర కేబినెట్‌లో నలుగురు మాజీ సీఎంలు.. 18 మాజీ మంత్రులకు అవకాశం లభించింది..ఈశాన్య రాష్ట్రాల నుంచి ఐదుగురికి ఛాన్స్ ఇచ్చారు.. ఇక కేంద్రమంత్రి వర్గంలో 13మంది లాయర్లు, ఆరుగురు డాక్టర్లు ఉన్నారు.. కేంద్ర కేబినెట్‌లో 8 మంది ఎస్టీలకు చోటు కల్పించారు.

Tags

Read MoreRead Less
Next Story