CAATSA Law: అమెరికాలో కీలక ముందడుగు.. భారత్కు అనుకూలంగా..
CAATSA Law: రష్యా అంటే అగ్రరాజ్యం అమెరికా భగ్గుమంటుంది. పుతిన్ పేరు ఎత్తినా చాలు ఒంటికాలితో శివాలెత్తారు బైడెన్. రష్యా అంటే గిట్టని అమెరికానే ఇప్పుడు భారత్, రష్యా మధ్య బలమైన బంధం వేసింది. అమెరికా ప్రతినిధుల సభలో భారత్కు అనుకూలంగా కీలక ముందడుగు పడింది. కాట్సా చట్టం నుంచి భారత్ను మినహాయిస్తూ రూపొందించిన సవరణ చట్టం బిల్లు అమెరికా ప్రతినిధుల సభలో పాస్ అయింది.
ఈ సవరణ ప్రతిపాదనను మూజువాణి ఓటుతో అమోదముద్ర వేసింది. దాంతో రష్యా నుంచి భారత్ ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన ఒప్పందానికి లైన్ క్లియర్ అయింది. ఎస్-400 క్షిపణితో ప్రత్యర్థి డ్రాగన్ దేశం చైనా దూకుడును భారత్ అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాట్సా సవరణ చట్ట బిల్లును ప్రాతిపాదించిన కాలిఫోర్నియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్వో ఖన్నా.. అమెరికా ప్రతినిధుల సభలో చైనా నుంచి భారత్కు ఎదురవుతున్న కవ్వింపులను ప్రస్తావించారు.
ఇలాంటి సమయంలో అమెరికా.. భారత్కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. 2018లో రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ సుమారు 35 వేల కోట్ల ఒప్పందం చేసుకుంది. రక్షణ రంగంలో పాశుపతాస్త్రంగా భావించే ఎస్-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుపై ఒప్పందం చేసుకున్న తర్వాత.. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కాట్సా చట్టాన్ని ప్రయోగిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com