Obesity | భారతీయ పిల్లల్లో పెరిగిన ఊబకాయం..

Obesity | భారతీయ పిల్లల్లో  పెరిగిన ఊబకాయం..
భారత్​లో కోటికిపైనే!

మానవాళిని తీవ్రంగా వేధిస్తున్న ఊబకాయం గురించి ప్రముఖ ఆరోగ్య జర్నల్‌ ది లాన్సెట్‌... నివేదించిన తాజా సమాచారం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయ బాధితులు 100 కోట్లు దాటినట్లు లాన్సెట్‌ అధ్యయనంలో తేలింది. భారత్‌లో ఏకంగా కోటీ 25 లక్షల మంది పిల్లలు ఊబకాయం బారిన పడినట్లు లాన్సెట్‌ పేర్కొంది.

భారత్‌లో ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. 2022 నాటికి దేశంలో 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గల కోటీ 25 లక్షలమంది.. ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ది లాన్సెట్‌ జర్నల్‌ తెలిపింది. ఇందులో 70లక్షలకు పైగా అబ్బాయిలు, 50 లక్షలకు పైగా అమ్మాయిలు ఉన్నట్లు వెల్లడించింది. భారత్‌లో 1990లో 1.2శాతంగా ఉన్న ఒబెసిటీ రేటు.. 2022 నాటికి 9.8 శాతానికి చేరింది. 2022 నాటికి దేశంలో 4 కోట్ల 40 లక్షల మంది మహిళలు, 2 కోట్ల 60 లక్షల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నట్లు లాన్సెట్‌ జర్నల్‌ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 1990లో 195 మిలియన్ల మంది ఒబెసిటీ బాధితులు ఉంటే ఆ సంఖ్య.. 2022కు ఒక బిలియన్‌ అంటే.. 100 కోట్లు దాటినట్లు వివరించింది. ఇందులో 88 కోట్ల మంది పెద్దవారు, 15 కోట్ల 90 లక్షల మంది పిల్లలు, యుక్తవయస్సుగల వారు ఉన్నారని స్పష్టం చేసింది. అంటే ప్రతీ 8 మందిలో ఒకరు ఒబెసిటీతో పోరాడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

గత 30 ఏళ్లలో పోషకాహార లోపంతో బాధపడుతూ తక్కువ బరువు ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ.. ఊబకాయుల సంఖ్య పెరగడానికి కారణం అధిక పోషకాహారం తీసుకోవడంతో సహా పోషకాహార లోపం కూడా కారణమని లాన్సెట్‌ పేర్కొంది. ఒక వైపు ఊబకాయుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నా.. ఇంకా చాలా పేద దేశాల్లో మాల్‌ న్యూట్రిషన్‌తో తక్కువ బరువు ఉన్నవారు చాలామందే ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. 2022 వరకు.. 18 కోట్ల 30 లక్షల మంది మహిళలు, 16కోట్ల 40 లక్షల మంది పురుషులు తక్కువ బరువుతో బాధపడుతున్నారని లాన్సెట్‌ నివేదించింది. ఊబకాయంపై ప్రపంచ దేశాలు ఇప్పుడే మేల్కొని చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా అధిక బరువుతో బాధపడతారని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ గతంలోనే హెచ్చరించింది

Tags

Read MoreRead Less
Next Story