అమెరికాలో ఉద్యోగం.. ఇక్కడ దొంగతనాలు

అమెరికాలో ఉద్యోగం.. ఇక్కడ దొంగతనాలు

అమెరికాలో ఉద్యోగం చేసి అక్కడినుంచి తిరిగొచ్చి దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరికిపోయిన ఓ అరవైఏళ్ల వ్యక్తి బాగోతం ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన అవినాష్‌ శర్మ(60) 1990లో అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఉద్యోగం చేస్తూ పాతికేళ్లు అక్కడే గడిపాడు. అయితే ఆయన వ్యవహారశైలి కారణంగా 2015 పౌరసత్వం లభించకపోవడంతో భారత్‌కు తిరిగి వచ్చేశాడు. దాంతో ఢిల్లీలో ఓ ఎలక్ట్రికల్‌ కంపనీలో ఉద్యోగంలో చేరాడు.. కొద్దిరోజులు బాగానే ఉన్నాడు.. కానీ అమెరికాలో విలాసవంతమైన జీవనం గడిపిన అవినాష్‌ శర్మకు ఇక్కడ సరిపడనంత డబ్బులు రాకపోవడంతో అసంతృప్తిగా ఉండేవాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు రవిగుప్తాతో చర్చించి.. రోహిత్‌, అమిత్‌ అనే వ్యక్తులతో కలిసి 2017లో అందరూ కలిసి గ్యాంగ్ లాగా ఏర్పడ్డాడు. అప్పటినుంచి పెద్ద వ్యక్తులను, కలెక్షన్‌ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుంటూ వారివద్ద డబ్బు దోచుకునే వారు..

ఇందుకు అవినాష్‌శర్మ పథకం వేస్తే మిగతావారు దానిని అమలు చేసేవారు. అయితే ఈ ఘటనల్లో బాధితులైన ఇద్దరు వ్యక్తులు క్రైంబ్రాంచ్‌ను ఆశ్రయించడంతో కేసు నమోదు అయింది.. వీరిని పట్టుకొనేందుకు టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరిని గుర్తించిన అధికారులు విజయ్‌విహార్‌లోని ఓ అపార్టుమెంట్లో తలదాచుకున్నట్లు గుర్తించారు.. వెంటనే అరెస్ట్ చేసి.. వారివద్దనుంచి మూడు తుపాకులు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అకౌంటెంట్‌ అయిన రవిగుప్తా వీరు దోచుకోవలసినవారి వివరాలు ఇచ్చేవాడని అతను విచారణలో అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ గ్యాంగ్ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అనేక మంది వ్యాపారవేత్తలను బెదిరించి సుమారు రెండుకోట్ల రూపాయల వరకూ దోచుకున్నారని పోలీసులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story