రైల్లో భోగి మంటలు.. కోచ్ నుంచి పొగ రావడంతో..
ఇంట్లో ఉంటేనే చలికి వణికిపోతున్నాం. ఇక తప్పనిపరిస్థితుల్లో ఎక్కడికైనా ప్రయాణించాల్సి వస్తే ముసుగు పెట్టి పడుకున్నా చలి గాలి మరింత ఇబ్బంది పెడుతుంది. అలా అని రైల్లో వెచ్చగా ఉండేందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలనుకుంటే అంతకంటే అతి తెలివి మరొకటి ఉండదు.. ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే. అయినా అతి తెలివితో కొందరు ప్రయాణికులు ఏకంగా పిడకలతో భోగిమంటలు వేశారు కదులుతున్నా రైల్లో.
సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులో అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. ముంచుకొచ్చే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి కేకలు వేయడం మొదలు పెట్టారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై పోలీసులు విచారించగా.. ఇద్దరు యువకులు నిప్పంటించినట్లు తెలిసింది. తీవ్రమైన చలి నుంచి తప్పించుకునేందుకు యువకులు కదులుతున్న రైలులో భోగి మంటలు వేయడంతో ప్రయాణికులు, రైల్వే యంత్రాంగం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కోచ్ నుంచి పొగలు రావడంతో రైల్వే అధికారులు రైలును ఆపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటన ఈశాన్య సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ (14037) జనరల్ కంపార్ట్మెంట్లో జరిగింది. ఈ రైలు అస్సాంలోని సిల్చార్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తోంది. చలి నుండి తమను తాము రక్షించుకోవడానికి, ఇద్దరు యువకులు ఎక్స్ప్రెస్ జనరల్ కోచ్ లోపల ఆవు పేడ పిడకలను కాల్చి దాని నుంచి వచ్చే మంటతో చేతులు వేడి చేసుకోవడం ప్రారంభించారు. అలీగఢ్ సమీపంలోని కంపార్ట్మెంట్ నుంచి పొగలు వస్తున్నాయని ఆర్పీఎఫ్ జవాన్లకు సమాచారం అందింది. దీంతో లోకో పైలట్ రైలును ఆపేశాడు. పోలీసులు జనరల్ కోచ్లోకి ప్రవేశించి, విచారణ అనంతరం నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసే చర్యలకు పాల్పడినందుకు వారికి చీవాట్లు పెట్టి వదిలేశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే శిక్ష కఠినంగా ఉంటుందని హెచ్చరించి పంపించారు.
ఫరీదాబాద్కు చెందిన చందన్కుమార్, దేవేంద్ర సింగ్ అనే 20 ఏళ్ల యువకులు ఈ చర్యకు పాల్పడ్డారు. అరెస్టు చేసిన తర్వాత, బాక్స్ లోపల చాలా చల్లగా ఉందని యువకులిద్దరూ పోలీసులకు చెప్పారు. మా ఉద్దేశ్యం రైలుకు నిప్పు పెట్టడం కాదు, చలి నుండి తప్పించుకోవడానికి మేము భోగి మంటలు వెలిగించాము అని తమ చర్యను సమర్ధించుకున్నారు.
పలువురు ప్రయాణికులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ జైలుకు పంపినట్లు అలీగఢ్ ఆర్పీఎఫ్ పోస్ట్ కమాండర్ రాజీవ్ శర్మ తెలిపారు. రైల్వే స్టేషన్కు సమీపంలో మండే వస్తువులను విక్రయించడం అతిపెద్ద నేరం. విచారణ అనంతరం నిందితులు తమ వెంట ఆవు పేడ కేక్లను తీసుకొచ్చినట్లు తేలింది. ఈ కేసులో పలువురు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, విచారణ అనంతరం వారిని విడిచిపెట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com