Goa : గోవాలో ఆపరేషన్ కమల్.. తిరగబడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
Goa : మహారాష్ట్ర సంక్షోభాన్ని మరిచిపోక ముందే... గోవాలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్లో ఫిరాయింపులు జరిగేలా మైఖల్ లోబో, మాజీ సీఎం దిగంబర్ కామత్ నేృత్వతంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... పార్టీపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం ఆరు నుంచి పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారనే సమాచారంతో ఏఐసీసీ అలర్టైంది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా రంగంలో దిగారు. గోవాలో రాజకీయ పరిణామాలను పర్యవేక్షించేందుకు ఎంపీ ముకుల్ వాస్నిక్ను గోవాకు పంపారు. అటు.. కాంగ్రెస్ నేత మైఖేల్ లోబోను గోవా శాసనసభ ప్రతిపక్షనేత పదవినుంచి తొలగించారు.
ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. 40మంది సభ్యుల సభలో.. కాంగ్రెస్కు 11మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఇద్దరు ఎంజీపీ, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. అయితే... 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తమ గెలుపు మార్గాన్ని సులభం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
2019 ఎన్నికల్లో దక్షిణ గోవా లోక్సభ సీటును బీజేపీ కోల్పోయింది. దీంతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే.. 2024లో ఆ సీటులో మళ్లీ గెలవచ్చనే అంచనాతోనే.... ఆపరేషన్ కమల్ చేపట్టినట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com