కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్డౌన్ పొడిగింపు
దాదాపు ఆరు నెలలుగా మూతబడిన సినిమా థియేటర్లు త్వరలోనే తెరుచుకోబోతున్నాయి. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్కు కేంద్ర ప్రభుత్వం క్రమంగా సడలింపులు ఇస్తోంది. సెప్టెంబర్ 30తో నాలుగో దశ అన్లాక్ ముగిసిన నేపథ్యంలో మరికొన్ని సడలింపులతో కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 5.0 మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు తెరుచుకునే వెసులుబాటు కల్పించింది. అయితే 50 శాతం సీట్లు సామర్థ్యంతో మాత్రమే థియేటర్లను నడపాలని సూచించింది.
అన్లాక్ 5.0లో భాగంగా కేంద్ర హోంశాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా మినహాయింపులు ఇచ్చే అంశాలను మార్గదర్శకాల్లో పేర్కొంది. క్రీడాకారుల కోసం స్విమ్మింగ్పూల్స్కు తెరిచేందుకు అనుమతినిచ్చింది. అంతేగాక, అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు తెరిచే అంశంపై నిర్ణయాన్ని తీసుకునే వెసులుబాటును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించింది. ఆన్లైన్ క్లాసులు కొనసాగించవచ్చని తెలిపింది. ఇక కోచింగ్ సెంటర్లు, కాలేజీలు దశల వారీగా తెరిచే అంశాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. ఇక కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగనుంది. రాష్ట్రాల మధ్య రాకపోకల్లో ఎలాంటి నిబంధనలు లేవని కేంద్రం స్పష్టం చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com