Tamilnadu : పచ్చని సంసారంలో సీరియల్ చిచ్చు

Tamilnadu : పచ్చని సంసారంలో సీరియల్ చిచ్చు
ఛానల్ మార్చమంటే ససేమిరా అన్న ఇల్లాలు..భర్త ఆత్మహత్య

పచ్చని కాపురంలో టీవీ సీరియల్ చిచ్చు పెట్టింది. ఎవరికి నచ్చినది వారు చూడాలనుకున్న భార్యా భర్తల మధ్యా తలెత్తిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. టీవీ చానల్ మార్చమని రిమోట్ ఇవ్వమని భర్త కోరగా ససేమిరా అంది భార్య. దీంతో భర్త కోపం తారాస్థాయికి చేరుకుంది. భార్య కూడా ఏమాత్రం తగ్గలేదు. మాటా మాటా పెరిగింది. చివరికి ఆవేశంలో ఆ భర్త ప్రాణాలు తీసుకున్న సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

కొత్త కొత్త సినిమాలు వస్తున్నా టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్‌కు ఏమాత్రం జనాదరణ తగ్గడం లేదు. అభిమాన సీరియల్ వస్తుందంటే చాలు మహిళలు తమ పనులన్నీ వదిలేసి.. టీవీలకు అతుక్కుపోతారు. పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా సీరియల్‌లో లీనమైపోతారు. ఈ సీరియల్ పిచ్చి కుటుంబంలో చిచ్చుపెట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా కారణమవుతున్నాయి.


తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరులో ఆశీర్వాదం, అతడి భార్య నిషా నివాసం ఉంటున్నారు. ఆశీర్వాదం ఆఫీసు నుంటి ఇంటికి వచ్చే సరికి.. భార్య నిషా తనకు ఇష్టమైన సీరియల్ చూస్తోంది. అలవాటు అయిన కధే అయినప్పటికీ ఛానల్ మార్చాలంటూ ఆమెను ఆశీర్వాదం కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో భార్యభర్తల మధ్య చిన్నగా వాగ్వాదం మొదలైంది. ఆశీర్వాదానికి చిర్రెత్తుకొచ్చి.. ఛానల్ మార్చాల్సిందేనని పట్టుపట్టాడు. ఈసారి ఆమెకు కూడా మండింది . అందుకు ఆమె ససేమిరా అంది. చివరకు ఈ గొడవ చినికి చినికి గాలివానలా మారింది. ఆశీర్వాదం భార్యపై తీవ్రంగా అరిచాడు. అలా ఇద్దరు మధ్యా మాటలు పెరిగాయి. దీంతో భర్తపై అలిగి కోపంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే సమయంలో ఆశీర్వాదం కూడా ఇంటి నుండి బయటికి వెళ్లాడు. అయితే, మర్నాడు ఉదయం భార్య ఇంటికి రాగానే ఆశీర్వాదం విగతజీవిగా పడి ఉన్నాడు. అతడు ఆత్మహత్యకు పాల్పడటంతో ఆమె షాకయ్యింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్య నిషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story