Women Reservation Bill: వ్యతిరేకంగా ఓటు వేసిన ఇద్దరు ఎంపీలు

Women Reservation Bill:  వ్యతిరేకంగా ఓటు వేసిన ఇద్దరు ఎంపీలు

నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ బిల్లు లోక్‌సభలో బంపర్‌ మెజార్టీతో ఆమోదం పొందింది. అత్యాధునిక సదుపాయాలతో కొత్త పార్లమెంట్ దిగువ సభ ఆమోదించిన తొలి బిల్లు ఇదే. ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా రెండు ఓట్లు పోలయ్యాయి.


చారిత్మ్రాక మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. 454 మంది ఎంపీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపగా.. ఇద్దరు ఎంపీలు ఆమోదం తెలపలేదని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అంతకు ముందు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేయగా.. ఆ తర్వాత స్లిప్పుల ద్వారా ఓటింగ్‌ను ప్రారంభించారు. ఓటేసిన 456 మంది లోక్‌సభ సభ్యులలో 454 మంది మద్దతుగా ఓటు వేయగా.. ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆ ఇద్దరు ఎంపీలు ఎంఐఎం పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు ఔరంగాబాద్‌/ఛత్రపతి శంభాజీనగర్‌ ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌ వ్యతిరేకంగా ఓటు వేశారు. మహిళల రిజర్వేషన్లలో మహిళలకు కోటా లేకపోవడంతో వీరు ఈ బిల్లును వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.

ఇక, ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో స్లిప్పుల ద్వారానే మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు 454 మంది ఎంపీలు మద్దతు తెలపడంతో లోక్ సభలో ఆమోదం లభించింది.


కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇది కేవలం అగ్రకుల మహిళల కోసమే ప్రవేశపెట్టిన బిల్లుగా అభివర్ణించారు. ఓబీసీ మహిళలకు, మహిళా కోటాలో రిజర్వేషన్ ఇవ్వనందుకు కేంద్రం తీరును తప్పుపట్టారు. ఎంఐఎం ఈ బిల్లును వ్యతిరేకిస్తుందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం లోక్ సభలో చర్చ జరిగింది. దాదాపు 8 గంటలపాటు ఈ బిల్లుపై సభలో డిస్కషన్స్ జరగగా.. దాదాపు 60 మంది ఎంపీలు మాట్లాడారు. అనంతరం ఓటింగ్ జరిగింది.




Tags

Read MoreRead Less
Next Story