CWC2023: టీమిండియా.. అన్‌ స్టాపబుల్‌

CWC2023: టీమిండియా.. అన్‌ స్టాపబుల్‌
ప్రపంచకప్‌లో వరుసగా ఎనిమిదో విజయం.... 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చిత్తు...

భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్లను మట్టికరిపిస్తున్న దక్షిణాఫ్రికాను 243 పరుగుల తేడాతో రోహిత్‌ సేన చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో భారత జట్టు మొదటి స్థానాన్ని పదిలం చేసుకుంది. శతకంతో సచిన్‌ సెంచరీల రికార్డును సమం చేసిన విరాట్‌ కింగ్‌ కోహ్లీకి ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకి లభించింది.


ప్రపంచకప్‌లో ఎదురొచ్చిన ప్రతి జట్టునూ ఓడిస్తూ సెమీస్‌లో అడుగు పెట్టిన భారత్‌... ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఎలాంటి మార్పులు లేకుండా రోహిత్ సేన బరిలోకి దిగింది. రోహిత్‌ శర్మతో కలిసి... శుభ్‌మన్‌ గిల్‌ భారత్‌ జట్టుకు అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. రోహిత్‌ దొరికిన బంతిని దొరికినట్లు బాదేశాడు. దీంతో ఆరంభంలో టీమిండియా స్కోరు జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయింది. రోహిత్‌ దూకుడుతో కేవలం 4.3 ఓవర్లలోనే భారత స్కోరు 50 పరుగుల మార్కు దాటింది. జట్టు స్కోరు ఆరు ఓవర్లలో 62 పరుగులు ఉన్న సమయంలో రోహిత్ శర్మ అవుటయ్యాడు. కేవలం 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్‌ 40 పరుగులు చేసి రబాడ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం కాసేపటికే గిల్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్సుతో 23 పరుగులు చేసి గిల్‌ అవుటయ్యాడు.


అనంతరం బర్త్‌ డే బాయ్‌ విరాట్‌ కోహ్లీ, శ్రేయస్స్‌ అయ్యర్‌ జట్టు స్కోరును ముందుకు నడిపించారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన అయ్యర్‌ ఆ తర్వాత ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 87 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 77 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్న అయ్యర్‌ను ఎంగిడి అవుట్‌ చేశారు. ఆ తర్వాత కాసేపటికే కేఎల్ రాహుల్ కూడా అవుటయ్యాడు. 17 బంతులు ఎదుర్కొని ఎనిమిది పరుగులు చేసిన రాహుల్‌ను జాన్సన్‌ అవుట్‌ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో 49వ సెంచరీని 119 బంతుల్లో అందుకున్నాడు. అందులో 10 ఫోర్లు ఉన్నాయి. మొత్తం 121 బంతులు ఎదుర్కొన్న విరాట్‌...101 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివర్లో సూర్యకుమార్‌ యాదవ్, రవీంద్ర జడేజా బ్యాట్‌ ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది.

భారీ లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఆశించిన ఆరంభం లభించలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఫాంలో ఉన్న క్వింటన్ డికాక్‌ను అవుట్ చేసి సఫారీ పతనాన్ని ప్రారంభించాడు. తొమ్మిదో ఓవర్లో టెంబా బవుమా, పదో ఓవర్లో ఎయిడెన్ మార్క్రమ్‌ను అవుటయ్యారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా కష్టాలు మరింత పెరిగాయి. షమీ, జడేజా వరుస ఓవర్లలో వికెట్లు తీశారు. దీంతో 40 పరుగులకే ప్రొటీస్ సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. ఆదుకుంటారనుకున్న డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. వీరు ఆరో వికెట్‌కు జోడించిన 19 పరుగులే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో అతి పెద్ద భాగస్వామ్యం. ఆ తర్వాత వికెట్లు టపటపా పడిపోయాయి. దీంతో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ అయింది.

Tags

Read MoreRead Less
Next Story