BRS: కేసీఆర్‌ సేవలు దేశానికి అవసరం

BRS: కేసీఆర్‌ సేవలు దేశానికి అవసరం
కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేయాలన్న నేతలు.... అందరి నిర్ణయాలు తీసుకుంటామన్న కేటీఆర్‌

భారత రాష్ట్ర సమితి అధినేత KCR సేవలు దేశానికి అవసరమని ఆయన పార్లమెంట్‌కు వెళ్లాలని మహబూబాబాద్ సన్నాహక సమావేశంలో సీనియర్ నేత వి.ప్రకాష్ కోరారు. సొంత పార్టీకి చెందిన వారే కొందరు వ్యతిరేకంగా పనిచేశారన్న రెడ్యానాయక్, శంకర్‌నాయక్ వ్యాఖ్యలు సమావేశంలో కలకలం రేపాయి. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అధినేత KCR ఎంపీ అభ్యర్థులను ఖరారు చేస్తారని కేటీఆర్ తెలిపారు. భారత రాష్ట్ర సమితి లోక్ సభ సన్నాహక సమావేశాలు నేతల విభిన్న అభిప్రాయాలకు వేదికలవుతున్నాయి. కార్యకర్తలకు గుర్తింపు, బీఆర్‌ఎస్‌గా పేరు మార్పు, సంక్షేమ పథకాల్లో పార్టీ భాగస్వామ్యం లేకపోవడం, దళితబంధు లాంటి అంశాలు తరచూ ప్రస్తావనకు వస్తున్నాయి. మహబూబాబాద్ సమావేశంలోనూ ఓ కార్యకర్త భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడంతో తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోయినట్లు తెలిపారు.


గత ప్రభుత్వం తమను ఒత్తిడికి గురిచేసిందని, జీతాలు తగిన సమయానికి ఇవ్వలేదన్న భావన ఉద్యోగుల్లో ఉందని మరో కార్యకర్త తెలిపారు. అయితే సీనియర్ నేత వి.ప్రకాష్ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. టవరింగ్ పర్సనాలిటీ అయిన కేసీఆర్ అవసరం శాసనసభలో లేదని ఆయన పార్లమెంట్‌కు వెళ్లాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ఉండాల్సిందేనన్న ప్రకాష్ KTRకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అన్నారు. KTR, హరీశ్‌రావు ఇద్దరూ ఇక్కడ సరిపోతారని చెప్పారు. KCR తెలంగాణకు చాలా చేశారన్న ప్రకాష్ ప్రస్తుతం ఆయన సేవలు, విజన్ దేశానికి అవసరమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ మద్థతుతోనే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. KCR అధికారంలోకి రాకుండా బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. రాహుల్ గాంధీని ఎదుర్కోవడం బీజేపీకు సమస్య కాదన్న ఆయన మూడోసారి గెలిస్తే KCRను ఎదుర్కోవడం కష్టమని బీఆర్‌ఎస్‌ కుట్ర చేసిందని అన్నారు.

అందరితో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అధినేత అభ్యర్థులను ఖరారు చేస్తారని కేటీఆర్ తెలిపారు. భారాస గెలిస్తేనే పార్లమెంటులో తెలంగాణ గళం వినిపిస్తుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.ఒక్క మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో నాలుగు వైద్య కళాశాలలు KCR ఏర్పాటు చేశారని, దేశంలో ఎక్కడా లేదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. డిసెంబర్ తొమ్మిదో తేదీ రోజు రెండు లక్షల రుణమాఫీ సహా అన్ని మాటలు చెప్పిన కాంగ్రెస్ దగా చేసిందని ఆరోపించారు. ఖమ్మంలో మూడు రకాల కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని ఒకరికి మరొకరు పడడం లేదని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ తేలేదని, తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం బీఆర్‌ఎస్‌తో మాత్రమే సాధ్యమని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story