BRS: తెలంగాణలో రేపటితో ప్రచారానికి తెర

BRS: తెలంగాణలో రేపటితో ప్రచారానికి తెర
పతాకస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న బీఆర్‌ఎస్‌.... కరెంటా.. కాంగ్రెస్సా తేల్చుకోవాలన్న కేటీఆర్‌

తెలంగాణలో శాసనసభ సమరంలో కీలకమైన ప్రచార ఘట్టం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకోవటంలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. అందరికంటే ముందే ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిన అధికార బీఆర్ఎస్‌ అభ్యర్థులు ఇప్పటికే పలు దఫాలుగా నియోజకవర్గాలను చుట్టేయగా... ఆఖరి ప్రయత్నాల్లో భాగంగా ఊరూవాడల్లో రోడ్‌షోలు, కార్నర్‌మీటింగ్‌లతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓ వైపు రాష్ట్ర నాయకత్వం, మరోవైపు పార్టీ అభ్యర్థులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తూ.... మూడోసారి గెలుపే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నారు.


కరెంటు కావాలో కాంగ్రెస్‌ కావాలో ప్రజలు ఓటేసేటప్పుడు గుర్తు తెచ్చుకోవాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్‌.... వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలో రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్‌ నేతల మాటలు నమ్మితే ఆగం అవుతారన్న ఆయన... కేసీఆర్‌ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి కోసం ప్రత్యేక విధానం తీసుకొస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌లో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వనసమారాధనం కార్యక్రమానికి హాజరైన బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మళ్లీ విజయం సాధించి, కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎంగా నిలుస్తారన్నారు. ఖైరతాబాద్‌లోని ఇంద్రానగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ కుటుంబసభ్యులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌ MIGలో పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహిపాల్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో జరిగిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనానికి హోంమంత్రి మహమూద్‌ అలీ హాజరయ్యారు.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో నర్సంపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా మంత్రి సత్యవతి రాఠోడ్‌ ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని తండాల్లో పర్యటించిన మంత్రి కేసీఆర్‌ మూడోసారి ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అక్కలచెడ గ్రామంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రచారం చేస్తున్న క్రమంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పెద్దిసుదర్శన్‌రెడ్డికి మద్దతుగా నర్సంపేటలోని వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో ప్రచారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సతీశ్‌కుమార్‌ కేసీఆర్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ, ఓట్లు అభ్యర్థించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జాజుల సురేందర్‌ నాగిరెడ్డిపేట్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


Tags

Read MoreRead Less
Next Story