TG: తెలంగాణలో ప్రధాన పార్టీల ముమ్మర ప్రచారం

TG: తెలంగాణలో ప్రధాన పార్టీల ముమ్మర ప్రచారం
పరస్పర విమర్శలు చేసుకుంటున్న అధికార, ప్రతిపక్షాలు... వ్యూహ, ప్రతి వ్యూహాలతో నేతల ప్రచారం

తెలంగాణలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ‌అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లోకెళ్తున్నాయి. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీల మేనిఫెస్టోతో పాటు ఎన్నికల్లో గెలిస్తే చేసే అభివృద్ధిని వివరిస్తూ నేతలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి నిజామాబాద్‌లో ఆరోపించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మంచిర్యాల జిల్లా తాండూరులో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రచారం నిర్వహించారు.


కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌కు మద్దతుగా సిద్దిపేట, చిగురుమామిడి, సైదాపూర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సత్తా చాటేందుకు బీఆర్‌ఎస్‌ ప్రచారం ముమ్మరం చేసింది. బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్దాలకోరు అని ఆయన మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని.... నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో మల్కాజ్ గిరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ...స్థానికుడైన తనను M.Pగా గెలిపించాలని కోరారు.

పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్లమెంటులో తెలంగాణ గొంతు వినిపించే నాయకుడ్ని ఎన్నుకోవాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండు ఏకమయ్యాయని మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి... ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీల నుంచి ప్రజలను తప్పుదోవపట్టించేందుకు నేతలు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ భాజపా అభ్యర్థి బూరనర్సయ్యగౌడ్ మోత్కూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ మైదానంలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాజపా M.P అభ్యర్థి అర్వింద్ పాల్గొన్నారు. మైదానంలో సాగుతున్న ఆర్చరీ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆయన...సరదాగా బాణాలు సంధించారు. పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఓటింగ్‌ శాతం పెరగడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పదేళ్ల మోదీ ప్రభుత్వం వల్ల దేశంలో పేదరికం విపరీతంగా పెరిగిపోయిందని.. అధికారాన్ని మారిస్తే తప్ప దేశం అభివృద్ధి చెందే అవకాశం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి పెద్దపల్లిలో ఆరోపించారు. గడ్డం వంశీకృష్ణకు తాము మద్దతు తెలుపుతున్నామని... కార్యకర్తలు అండగా నిలబడి గెలిపించాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story