Telangana: ఏపీకి విద్యుత్ బకాయిల చెల్లింపుపై తెలంగాణకు కేంద్రం షాక్‌..

Telangana: ఏపీకి విద్యుత్ బకాయిల చెల్లింపుపై తెలంగాణకు కేంద్రం షాక్‌..
Telangana: ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు తక్షణమే చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ తెలంగాణను ఆదేశించింది.

Telangana: తెలంగాణకు షాక్ ఇచ్చింది కేంద్రం. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు తక్షణమే చెల్లించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలంగాణను ఆదేశించింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు.. ఈ బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది. ఏపీ డిస్కంలు 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్ పది వరకు విద్యుత్ సరఫరా చేశాయని స్పష్టం చేసింది. ఈ సరాఫరాకు సంబంధించి 3 వేల 441 కోట్ల 78 లక్షలతో పాటు 2022 జులై 31 వరకు ఆలస్య రుసుముగా మరో 3 వేల 315 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా ఏపీకి చెల్లింపులు చేయాలంటూ కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అనూప్ సింగ్ బిష్ట్ తెలంగాణ సీఎస్‌కు సూచించారు. కేంద్రం ఆదేశాలపై మండిపడింది తెలంగాణ సర్కార్‌. కేంద్రానిది ముమ్మాటికి దేశద్రోహపూరిత చర్యేనంటూ ఫైర్ అయ్యారు మంత్రి జగదీశ్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు 12 వేల 900 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. విద్యుత్‌తో పాటు బకాయిలు, PPAలలోనూ ఏపీ..తెలంగాణకు నష్టమే చేసిందన్నారు. విద్యుత్ రంగంలో కేసీఆర్‌ సాధించిన విజయాలను బీజేపీ సర్కార్ జీర్ణించుకోలేకపోతుందన్నారు.

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరాఫరాకు అడ్డుపుల్ల వేసేందుకే ఈ నిర్ణయమన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ పంచాయితీ ఎప్పటినుంచో నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు బకాయిలు రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ బకాయిలు చెల్లించేలా ఆదేశించాలని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణకు విద్యుత్ సరాఫరా చేసినందుకు తమకు 3 వేల 441 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఇవాల్సి ఉందని..దానికి వడ్డీ కూడా చెల్లించాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొంది.

విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్ సరాఫరా చేసినప్పటికీ బిల్లులు చెల్లించలేదని ఏపీ సర్కార్ వాదిస్తోంది. బకాయులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సర్కార్ పలు మార్లు లేఖలు సైతం రాసింది. ఐతే దీనిపై తెలంగాణ ప్రభుత్వం వాదన మరోలా ఉంది. ఏపీ విద్యుత్ సంస్థలే తమకు డబ్బులు చెల్లించాలని తెలంగాణ సర్కార్ చెప్తోంది. ఏపీ నుంచి తమకు ఐదు వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని చెప్తోంది. విద్యుత్ బకాయిలపై లెక్కలు క్లియర్ చేసుకుందామని లేఖలు రాసినా.. ఏపీ లెక్కలు చూడడం లేదని తెలంగాణ వాదిస్తోంది.

డిస్కంల నుంచి బకాయిలు ఉంటే వాటిని వసూలు చేసుకోవాలి కానీ.. జెన్‌ కో చెల్లించాల్సిన డబ్బులు నిలిపివేయడం సరికాదని తెలంగాణ చెప్తోంది. ఈ వివాదంపై జాతీయ కంపెనీల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి రెండు రాష్ట్రాలు. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్‌ నుంచి కేసును వాపసు తీసుకుంది. ఐతే బకాయిలు చెల్లించాలని తెలంగాణ సర్కార్‌పై ఒత్తిడి తెస్తూనే ఉంది. తాజాగా సీఎం జగన్‌ కేంద్రమంత్రిని కలిసి ఈ విషయంపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story