TS: తెలంగాణలో బాలరాజుపై దాడి కలకలం
అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై శనివారం రాత్రి జరిగిన దాడి మాటల యుద్ధానికి దారి తీసింది. గాయాలకు చికిత్స తర్వాత అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలరాజుతనపై దాడి కాంగ్రెస్ నేత వంశీకృష్ణ అనుచరుల పనేనని ఆరోపించారు. ప్రజల ఆశీస్సులతోనే దాడి నుంచి ప్రాణాలతో బయటపడినట్లు తనపై గతంలోనూ వంశీకృష్ణ దాడులు చేయించారని బాలరాజు ఆరోపించారు. తనని ఎదుర్కొనే ధైర్యం లేక... అంతమొందించే కుట్ర చేస్తున్నారని గువ్వల బాలరాజు ఆరోపించారు. తనపై గతంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ దాడులు చేయించారన్న బాలరాజు నిన్న రాత్రి జరిగిన దాడులు సైతం వంశీకృష్ణ చేయించినట్లు ఆరోపించారు.
హైదరాబాద్ ఆస్పత్రిలో ఉన్న గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై నిన్న రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే నష్టపోయేది మీరే అంటూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనన్న కేటీఆర్ గువ్వల బాలరాజుకు భద్రత పెంచాలని డీజీపీని కోరుతున్నారు.
అయితే గువ్వల బాలారాజుపై దాడి కాంగ్రెస్ నేతల పనేనన్న బీఆర్ఎస్ భారాస ఆరోపణలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగతోందని ఆరోపించారు. సానుభూతికోసం KTR వ్యూహాలు రచిస్తున్నారన్న రేవంత్ రెడ్డి వరుస దాడి ఘటనల వెనక ప్రశాంత్ కిశోర్ ఉన్నాడని ఆరోపించారు. ఏపీలో కోడికత్తి ఘటన... బంగాల్లో మమతా బెనర్జీ కాలి గాయం ఘటనలే.. ఇందుకు సాక్ష్యమని రేవంత్ అన్నారు. మరో 3 కుట్రలు జరుగుతాయని కేటీఆర్ స్పష్టంగా చెప్పారని... ఆ ప్రకటనపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని రేవంత్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ కుట్రలపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్రెడ్డి... తప్పుడు ప్రకటనలపై ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్రావుపై విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని... ఎస్సీ వర్గీకరణ రాహుల్గాంధీ ఎప్పుడో మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితే కాంగ్రెస్ భేషరతుగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు అచ్చంపేట నియోజకవర్గంలో భారాస అభ్యర్థి గువ్వల బాలరాజుకు మద్దతుగా వ్యవహరిస్తున్న సీఐపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. సీఐని తక్షణమే బదిలీ చేసి కొత్త అధికారిని నియమించి. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని కాంగ్రెస్ సీఈసీని కోరింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com