TS: తెలంగాణలో హోరెత్తుతున్న ప్రచారం

TS: తెలంగాణలో హోరెత్తుతున్న ప్రచారం
తమదైన శైలిలో ప్రచారం... విమర్శలు-ప్రతి విమర్శలతో సాగుతున్న ప్రచారం

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీల నేతలపై విరుచుకుపడుతున్నారు. గత పాలకులు చేసిన అభివృద్ధిని శూన్యమంటూ గెలిస్తే నియోజకవర్గానికి తామేమి చేస్తామో చెబుతూ విభిన్న రీతుల్లో ప్రజల్లోకెళ్తున్నారు.


ఏపీలో రాజకీయం రోజురోజుకి రంజుగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వర్తిస్తూ ప్రజల్లోకెళ్తున్నారు. హైదరాబాద్ నార్సింగి అల్కాపురి కాలనీలో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వశ్వర్ రెడ్డికి మద్దుతుగా ఆయన భార్య కొండా సంగీత రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాకర్స్‌తో మాట్లాడిన ఆమె గత పదేళ్ల కాలంలో నరేంద్ర మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. జహీరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి B.B పాటిల్ ప్రచార జోరు పెంచారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కార్యకర్తలతో కలిసి ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్.. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటూ ముందుకు సాగారు. బీజేపీ సంక్షేమ పథకాలే... పార్టీ గెలుపునకు కారణమవుతాయని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లోని బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అరుణ... హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటేసి భారీ మెజర్టీతో గెలిపించాలని కోరారు.

హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి బీఆర్‌ఎస్ MP అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. రామగుండం సింగరేణి OCP -5 గనులపై ప్రచారం నిర్వహించిన కొప్పుల... లోక్‌సభ ఎన్నికల్లో భారాసకే ఓటేసి గెలిపించాలని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి... ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుంచుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. అభివృద్ధిని కాంక్షించే వినోద్ కుమార్ లాంటి వారిని చట్టసభలకు పంపించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని నాగర్ కర్నూల్ భారాస అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ యుద్దభేరి సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్‌.... సమర్థుడిని ఎన్నుకుంటేనే ప్రజాస్వామ్యానికి న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేసే విధంగా ముందుకు సాగుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బాన్సువాడలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న ఆయన... జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story