విలేకరి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘనందన్‌రావు

విలేకరి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘనందన్‌రావు

దుబ్బాకలో బీజేపీ దుమ్మరేపింది. చివరి రౌండ్ వరకు రసవత్తరంగా కొనసాగింది. ఐపీఎల్‌ సూపర్‌ ఓవర్‌లో కూడా ఇంత మజా ఉండదేమో.. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన హోరా హోరీ పోరులో.. దుబ్బాక గడ్డపై కాషాయ జెండా ఎగరవేసింది బీజేపీ. టీఆర్‌ఎస్‌పై 1,079 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్ధి రఘనందన్‌రావు సంచలన విజయం సాధించారు. ఆయనకు 63 వేల 140 ఓట్లు రాగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత 62 వేల 022 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి 21 వేల 819 సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. మొత్తంగా బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌గానే కౌంటింగ్‌ కొనసాగింది. 12‌, 20వ రౌండ్‌ తప్పా కాంగ్రెస్‌ ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో సంబరాల్లో మునిగియారు బీజేపీ శ్రేణులు.

ఆఖరి రౌండ్‌ వరకు ఉత్కంఠగా సాగింది ఎన్నికల కౌంటింగ్‌. నువ్వా నేనా అన్నట్లు ఫలితం రెండు పార్టీల మధ్య దోబూచులాడింది. కానీ 22వ రౌండ్‌లో ఎప్పుడైతే లీడ్‌లోకి వచ్చిందో... అప్పుడే బీజేపీ విజయం దాదాపు ఖాయమైపోయింది. బిహార్‌తో పాటు ఎన్నో రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ తెలంగాణ ప్రజలు చూపు మాత్రం దుబ్బాక ఎన్నికల ఫలితం మీదే. క్షణం క్షణం మారుతున్న లీడింగ్స్‌ అందరిలో తీవ్ర ఉత్కంఠను క్రియేట్‌ చేశాయి. అసలు టీఆర్‌ఎస్‌ గెలుస్తుందా? బీజేపీ గెలుస్తుందో తేల్చుకోక అంతా సందిగ్ధంలో పడిపోయారు. కౌంటింగ్‌ ఆరంభం నుంచే బీజేపీ ఆధిక్యత ప్రదర్శించింది. తొలి ఐదు రౌండ్లలో లీడ్‌లో దూసుకెళ్లిన కమలం... ఏకంగా 4 వేల ఆధిక్యతను సాధించింది. అయితే ఆరు, ఏడు రౌండ్లలో మాత్రం కారు ఆధిక్యతను చూపించింది. మళ్లీ 8 రౌండ్‌లో దూసుకొచ్చిన బీజేపీ.. టీఆర్‌ఎస్‌పై సంపూర్ణ ఆధిక్యతను సాధించింది. అప్పటికే బీజేపీ విజయం ఖాయమైనట్లే అని ఆ పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్ధమైన సమయంలో.. అనూహ్యంగా 12వ రౌండ్‌ నుంచి కారు గేరు మార్చింది. 19 రౌండ్ల వరకు జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లింది. అంతా టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమనుకున్నారు. 20వ రౌండ్‌ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యం దక్కింది. ఇంకా మూడు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఉన్న తరుణంలో... వరుసగా మూడు రౌండ్లను తన ఖాతాలో వేసుకుని దుబ్బాక సీటును కైవసం చేసుకుంది బీజేపీ. టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానంలో సంచలన విజయాన్ని నమోదు చేసింది.

స్వల్ప తేడాతో సిట్టింగ్‌ స్థానం కోల్పోవడంతో.. గులాబీ శ్రేణులు కాస్తా నిరాశలో మునిగిపోయారు. దుబ్బాక ప్రజా తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు మంత్రి హరీష్‌. గెలుపుకు పొంగిపోమని.. ఓటమికి కుంగిపోమన్నారు. ఓటమిని సమీక్షించుకుంటామన్నారు.

దుబ్బాకలో గెలుపుతో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు రఘనందన్‌రావు. విలేకరి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన ఆయన.. బీజేపీలో కీలక నేత. క్యాడర్‌కు అందుబాటులో ఉంటాడనే పేరు కూడా ఉంది. రెండు సార్లు ఓటమి పాలైన పోరాటం ఆపలేదు. చివరికి మూడోసారి దుబ్బాకలో విజయకేతనం ఎగరవేసి తాను అనుకున్నది సాధించారు. సిద్ధిపేటలో బీఎస్సీ చేసిన రఘనందన్‌రావు.. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. అనంతరం ఓ ప్రముఖ పత్రికలో విలేకరిగా పని చేశారు. తదనంతరం హైకోర్టు బార్‌ అసోషియేషన్‌లో న్యాయవాదిగా చేరారు. టీఆర్‌ఎస్‌లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రఘు.. ఆ పార్టీలో పొలిట్‌ బ్యూరో సభ్యులుగా, మెదక్‌ జిల్లా అధ్యక్షునిగా పని చేశారు. అయితే 2013లో టీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్‌ కావడంతో బీజేపీలో చేరారు. 2014, 2019లో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన విజయం సాధించారు.

Tags

Read MoreRead Less
Next Story