దేవరకొండ రొడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి

దేవరకొండ రొడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి
వరి నాట్లు వేసి ఆటోలో వస్తుండగా ప్రమాదం.. డ్రైవర్‌ మినహా మిగిలిన 19 మంది మహిళా కూలీలే.

వారంతా రెక్కాడితేగాని డొక్కాడని వ్యవసాయ కూలీలు. రోజంతా వరి నాట్లు వేసి అలసిన శరీరాలతో సాయంత్రం ఆటోలో ఇళ్లకు బయలుదేరారు. వీరు రోడ్డెక్కిన పది నిమిషాల్లోనే కంటెయినర్‌ రూపంలో మృత్యుశకటం ఎదురుగా దూసుకొచ్చి ఆటో డ్రైవర్‌ సహా 9 మందిని బలిగొంది. హైదరాబాద్‌-సాగర్‌ రహదారిపై నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజీ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆటోలో డ్రైవర్‌ మినహా మిగిలిన 19 మంది మహిళా కూలీలే. ఈ ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

దేవరకొండ మండలం చింతబాయి గ్రామానికి చెందిన 20 మంది వ్యవసాయ కూలీలు 40 కిమీ దూరంలోని పీఏపల్లి మండలం రంగారెడ్డిగూడెంలో వరి నాట్లు వేయడానికి ఉదయం ఆటోలో వెళ్లారు. పని ముగించుకొని సాయంత్రం తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో అంగడిపేట స్టేజ్‌ వద్ద సాగర్‌ వైపు వెళ్తున్న కంటెయినర్‌ ఓ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొట్టి కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు దేవరకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరు హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. స్వల్పంగా గాయపడిన మరో ముగ్గురికి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కంటెయినర్‌ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడం, అతివేగంతో ఢీకొట్టడం, ఆటోలో పరిమితికి మించి కూలీలు ఉండటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. మృతులను దేవరకొండ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించడంతో ఆసుపత్రి ప్రాంగణమంతా వారి బంధువుల రోదనలతో నిండిపోయింది.

ప్రమాదంలో ఆటో డ్రైవర్‌, కూలీ కొట్టం మల్లేశ్‌ తో పాటు అతడి భార్య చంద్రకళ , తల్లి పెద్దమ్మ మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మల్లేశ్‌, చంద్రకళ దంపతులకు 10, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. తల్లిదండ్రులు, నాయనమ్మ మృతితో ఆ చిన్నారులు దిక్కులేనివారయ్యారు.

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయాలతో ఆసుపత్రిలో చేరిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story