కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఇచ్చిన సమాధానం సరిగా లేదు : కేటీఆర్‌

కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఇచ్చిన సమాధానం సరిగా లేదు : కేటీఆర్‌

బీజేపీ నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు మంత్రి కేటీఆర్‌. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. 2016లోనే కేంద్రమంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయను కలిసి డీపీఆర్‌లను స్వయంగా అందించానన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు తెలంగాణకి తీసుకురావాలనే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజు నుంచే తమ ప్రభుత్వానికి ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 2014 జూన్ నెలలోనే సీఎం కేసీఆర్‌.. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ఒక లేఖ సైతం రాశారని తెలియజేశారు. ఆ తదుపరి కనీసం 10 సార్లు కేంద్ర ప్రభుత్వానికి వివిధ సందర్భాల్లో లేఖల ద్వారా, ప్రత్యక్షంగా కలిసి ఐటిఐఆర్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. తాజాగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి దోత్రే ఇచ్చిన సమాధానం పట్ల కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఐటీఐఆర్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం, లోక్‌సభను తప్పుదోవ పట్టించడమే అని కేటీఆర్ అన్నారు.

కేంద్రం అడిగినా పూర్తి సమాచారంతో పాటు డీపీఆర్‌లను సైతం గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి.. తమ ప్రభుత్వం సమర్పించినదని, ఆ తర్వాత ఐ.టి.ఐ.ఆర్‌కు సంబంధించి అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు వెళ్లిన విషయాన్ని సైతం కేంద్ర మంత్రి దాచిపెట్టారని అన్నారు కేటీఆర్‌. గత హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ సైతం ఐటీఐఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాచారం సమర్పించలేదన్న మాట చెప్పినప్పుడు, 2016లో తాను స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి వెళ్లిన ప్రతి సమాచారాన్ని అందించి వచ్చానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన డీపీఆర్‌ని సైతం అందించానని, కనీసం ఇప్పుడైనా ఐటీఐఆర్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని బండారు దత్తాత్రేయను కోరిన విషయాన్ని గుర్తు చేశారు.

బీజేపీ నాయకులతో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ సైతం అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. 2014 జూన్ నెల నుంచి 2021 జనవరి వరకు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఐటిఐఆర్‌పై సత్వర నిర్ణయం తీసుకొని హైదరాబాద్ ఐటీ పరిశ్రమకి మరింత ఊతం అందించాలని పదేపదే విజ్ఞప్తి చేశామన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి పంపిన ప్రతి లేఖ, విజ్ఞప్తి ప్రజల దృష్టిలో ఉన్నదని అన్నారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రెండు సార్లు ఐటిఐఆర్‌కు సంబంధించిన డీపీఆర్‌లను సమర్పించిందన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులన్నింటినీ బుట్టదాఖలు చేసిన కేంద్రం.. పూర్తిగా ఐటిఐఆర్‌ని రద్దు చేసిందన్నారు. తాజాగా కేంద్రమంత్రి పార్లమెంట్లో ఇచ్చిన సమాధానంలోనూ ఐటీఐఆర్‌ను రద్దు చేయాలన్న వైఖరి స్పష్టంగా ఉన్న విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తించాలన్నారు.


Tags

Read MoreRead Less
Next Story