T-Congress: టి-కాంగ్రెస్ సంక్షోభానికి తెర.. రంగంలోకి దిగిన అధిష్టానం

T-Congress: టి-కాంగ్రెస్ సంక్షోభానికి తెర.. రంగంలోకి దిగిన అధిష్టానం
T-Congress: తెలంగాణ కాంగ్రెస్‌ సంక్షోభాన్ని తెరదించేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించారు.

T-Congress: తెలంగాణ కాంగ్రెస్‌ సంక్షోభాన్ని తెరదించేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ దిశగా ప్రత్యేకంగా దృష్టి సారించారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీనియర్ల మధ్య విభేదాలను చక్కబెట్టేందుకు... రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలపై పట్టున్న నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్‌కు రంగంలోకి దింపింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు దిగ్విజయ్‌సింగ్‌ రానున్నారు. పార్టీ నేతల మధ్య సమన్వయమే లక్ష్యంగా రేపు రేవంత్‌రెడ్డితో పాటు సీనియర్‌ నేతలతోనూ భేటీ కానున్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు దిగ్విజయ్ సింగ్.


ఇప్పటికే మల్లికార్జున ఖర్గే... సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో ఫోన్‌లో మాట్లాడారు. అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ కూడా ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చించారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లేలా అన్ని చర్యలు తీసుకుంటామని, అంతవరకూ ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని వారించారు. ఇక ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డితో దిగ్విజయ్‌సింగ్‌ మాట్లాడటంతో నిన్న జరగాల్సిన సీనియర్ల సమావేశాన్ని విరమించుకున్నారు.


రేవంత్‌ వైఖరితో పాటు ఇటీవల నియమించిన కమిటీలపై సీనియర్‌ నేతలంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, జగ్గారెడ్డి, మధుయాస్కీ సహా ఇతర సీనియర్‌ నేతలంతా శనివారం సీఎల్పీ నేత నివాసంలో ప్రత్యేకంగా సమావేశమవడమే కాకుండా కొత్త కమిటీల ఏర్పాటు, రేవంత్‌ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుసటి రోజు గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరుకాలేదు. పార్టీలో సీనియర్లు, కొత్తగా చేరిన నేతల మధ్య విభేదాలు ముదరడంతో.. పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఆలస్యం చేస్తే మరింత నష్టం జరుగుతుందని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావించింది. దిగ్విజయ్‌సింగ్‌ను రంగంలోకి దింపింది.


ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా సుదీర్ఘకాలం వ్యవహరించిన దిగ్విజయ్‌సింగ్‌కు... తెలంగాణ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సీనియర్‌ నాయకుడు కావడంతో పాటు రాష్ట్రంలోని అందరు నేతలను సమన్వయం చేయగలరని అధిష్ఠానం భావిస్తోంది. ప్రస్తుతం ఏఐసీసీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఎంపీ మాణికం ఠాగూర్‌ వ్యవహారశైలిపై కూడా రాష్ట్ర సీనియర్‌ నేతలు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డికి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గతంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటి దృష్ట్యా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కూడా చర్చిస్తారని దిగ్విజయ్‌సింగ్‌ భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story