TS ELECTIONS: నేటితో ప్రచారానికి తెర

TS ELECTIONS: నేటితో ప్రచారానికి తెర
మూగబోనున్న మైకులు... సాయంత్రం ఆయిదు గంటల నుంచి అమల్లోకి 144 సెక్షన్

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. కొన్నాళ్లుగా హోరెత్తించిన మైకులు మూగబోనున్నాయి. ప్రచారం పరిసమాప్తితో ఆంక్షలు అమలు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ వర్తించనుంది. ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. మద్యం దుకాణాలు కూడా సాయంత్రం నుంచి మూతపడనున్నాయి. బహిరంగసభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్రలతో... అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తింది. శాసనసభ ఎన్నికలకు అక్టోబర్ తొమ్మిదో తేదీన ప్రకటన వెలువడగా... ఈనెల మూడో తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ప్రకటన కంటే ముందే తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక ప్రచార పర్వం మరింత ఉద్ధృతమైంది.


అధికార భారత రాష్ట్ర సమితితోపాటు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ విస్తృతంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. మజ్లిస్, బీఎస్పీ, వామపక్షాలు సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. ఆయా పార్టీల తరపున అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. తమ పార్టీ విధానాలను వివరిస్తూ, వైరి పక్షాల వైఖరిని ఎండగడుతూ ప్రచారాన్ని వేడెక్కించారు. విమర్శలు, ప్రతివిమర్శలతో ఎన్నికల ప్రచారం కదనరంగాన్ని తలపించింది. ఆయా పార్టీల తరపున ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గత కొన్నాళ్లుగా హోరెత్తించిన ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది.


పోలింగ్‌కు 48గంటల ముందు సైలెన్స్ పీరియడ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 13 నియోజకవర్గాల్లో పోలింగ్ 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. దీంతో ఆ 13 నియోజకవర్గాల్లో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సైలెన్స్ పీరియడ్ ప్రారంభంతో ఆంక్షలు అమల్లోకి వస్తాయి.


ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు, నిర్వహించరాదు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. అభ్యర్థులు, వారి తరపున కేవలం ఇంటింటి ప్రచారం మాత్రమే చేసుకోవచ్చు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు సహా ఇతరత్రా చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తారు. ప్రలోభాల కట్టడిపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించడంతోపాటు నిఘా మరింత పటిష్టం చేస్తారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద తనిఖీలు కట్టుదిట్టం చేస్తారు. మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను సాయంత్రం నుంచి మూసివేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story