TRS : ఒక్క సీటు... భారీ సంఖ్యలో ఆశావహులు..!

TRS : ఒక్క సీటు... భారీ సంఖ్యలో ఆశావహులు..!
TRS : శాసనమండలికి ఎన్నికైన బండ ప్రకాష్‌... రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తుండడంతో ఆ స్థానం ఖాళీ కానుంది.

TRS : శాసనమండలికి ఎన్నికైన బండ ప్రకాష్‌... రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తుండడంతో ఆ స్థానం ఖాళీ కానుంది. మూడున్నరేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌ ను శాసనమండలికీ పోటీచేయించారు గులాబీ బాస్‌. దీంతో ప్రకాశ్‌ స్థానాన్ని కేసీఆర్‌... ఎవరితో భర్తీ చేయబోతున్నారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ రాజ్యసభ స్థానానికి ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది .

ఎమ్మెల్యే కోటా లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు, స్థానిక సంస్థల కోటా లోని 12 ఎమ్మెల్సీ స్థానాలతో పాటు గవర్నర్ కోటాలోని ఒక స్థానంపై 50 మందికి పైగా సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. అయితే కేసీఆర్‌ అనూహ్య నిర్ణయాలతో చాలామందికి అవకాశం దక్కలేదు . ఇక రాజ్యసభ అవకాశం మిగిలి ఉండటంతో లక్కీ ఛాన్స్ దక్కించుకునేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీపరంగా ఢిల్లీలో చురుగ్గా పనిచేసే నేతనే పెద్దల సభకు ఎంపిక చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు... ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీమంత్రి వెంకటేశ్వరరావులు రాజ్యసభ టికెట్‌ కోసం పోటీపడుతున్నారు. ఇక ఎమ్మెల్సీ పదవి రెన్యూవల్ కాకుండా మాజీలైన కర్నె ప్రభాకర్ , ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్ రావు లాంటి వారు కూడా రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక చాలా కాలంగా ఎలాంటి పదవులు లేకుండా ఎదురు చూస్తున్న పిఎల్ శ్రీనివాస్ తో పాటు దామోదర్ రావు, పలువురు పారిశ్రామిక వేత్తలు, మరికొంతమంది సీనియర్లు చివరి అవకాశం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఖాళీకానున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన రాజ్యసభ సీటు ఎవరికి దక్కుతుందనేది టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎవరికీ అంతుచిక్కని రీతిలో అనూహ్య నిర్ణయాలు తీసుకునే గులాబీ అధినేత... ఎవరికి ఛాన్స్‌ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story