Afghan embassy : భారత్‌లో అఫ్ఘాన్ రాయబార కార్యాలయం మూసివేత

Afghan embassy : భారత్‌లో అఫ్ఘాన్ రాయబార కార్యాలయం మూసివేత
యూకే, యూఎస్ఏలకు వెళ్ళిపోయిన దౌత్యవేత్తలు

భారత్ లోని అఫ్గాన్ రాయబార కార్యాలయం మూతబడింది. తాలిబాన్ పాలనలో వనరుల కొరత, అఫ్గాన్ ప్రయోజనాలను తీర్చడంలో తమ పాలకుల వైఫల్యం, భారత్ నుంచి తమకు తగినంత మద్దతు లేకపోవడంతో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అఫ్గాన్ ఎంబసీ ప్రకటించింది. ఎన్నికైన ప్రభుత్వ లక్ష్యాలకు తాలిబన్ల వైఖరి అనుగుణంగా లేదనీ చట్టవిరుద్ధ పాలనా ప్రయోజనాలతో పని చేస్తోందని స్పష్టం చేసింది. 22 ఏళ్లపాటు కార్యకలాపాలు సాగించిన భారత్ లోని తమ ఎంబసీని మూసివేస్తున్నందుకు విచారం వ్యక్తం చేసింది. వియన్నా ఒప్పందం ప్రకారం రాయబార కార్యాలయం ఆస్తులను ఆతిథ్య దేశపు సంరక్షక అధికారానికి బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది. ప్రజాస్వామ్యం,చట్టబద్ధ పాలన అప్గాన్ల శ్రేయస్సును నిలబెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు వివరించింది. ఇన్నేళ్లూ తమకు మద్దతుగా నిలిచినందుకు భారత ప్రజలకు, ప్రభుత్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపింది.


నిజానికి గత కొన్ని నెలలుగా భారత్‌లో ఆఫ్ఘాన్ రాయబారి లేరు. ఢిల్లీలోని ఆఫ్ఘాన్ దౌత్యవేత్తలు కూడా యూకే, అమెరికా వెళ్లి ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత్ లో ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయం అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ముగ్గురు రాయబార కార్యాలయ అధికారులు శుక్రవారం తెలిపారు. భారతదేశం తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత భారత్, కాబూల్ లోని దౌత్యకార్యాలయాన్ని మూసేసింది. అయితే భారత్ అంతకుముందు ఆఫ్ఘాన్ ప్రెసిడెంట్ గా ఉన్న అష్రఫ్ ఘనీ నియమించిన రాయబారి సిబ్బందికి వీసాలు జారీ చేయడానికి, వ్యాపార వ్యవహారాలు చూసేందుకు అనుమతించింది. ప్రస్తుతం ఐదుగురు ఆఫ్ఘన్ దౌత్యవేత్తలు భారత్ విడిచిపెట్టినట్లు ఎంబసీ అధికారులు తెలిపారు. భారత ప్రభుత్వం ఇప్పుడు కేర్ టేకర్ హోదాలో రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోనుంది. అయితే ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ పరిశీలిస్తోంది. కాబూల్ లోని తాలిబాన్ అధికారులు కూడా దీనిపై స్పందించలేదు.


తాలిబాన్ అధికారం చేపట్టకముందు అప్పటి అష్రఫ్ ఘనీ సర్కార్ ఆఫ్ఘాన్ ఎంబసీ హెడ్ గా అంబాసిడర్ గా ఫరీద్ మమున్‌జేని నియమించింది. 2021 ఆగస్టులో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ఆయనే రాయబారిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇతను లండన్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్- మే నెలల్లో తాలిబాన్లు ఫరీద్ స్థానంలో ఖాదిర్ షాను నియమించింది. అప్పటి నుంచి ఎంబసీలో అధికారం కోసం కమ్ములాట మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ లో మానవతా సాయం, వైద్య సహాయం, వాణిజ్యం సులభతరం చేయడానికి కాబూల్‌లో మిషన్ నడుపుతున్న కొన్ని దేశాల్లో భారత్ ఒకటి. 2019-20లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ఇది బాగా పడిపోయింది. భారత్ లో విద్యనభ్యసిస్తున్న వందలాది ఆఫ్ఘాన్ విద్యార్థులు వీసా గడువు ముగిసిపోయిన ఇంకా ఇక్కడే ఉన్నారు. వారు తమను భారత్ లోనే ఉండనివ్వాలని కోరుతూ ఈ నెల ప్రారంభంలో న్యూఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు.


Tags

Read MoreRead Less
Next Story