87 రూపాయలకే ఇల్లు.. ఎక్కడో తెలుసా!!
లక్షలు దాటి కోట్లకు చేరుకుంటున్నాయి ఇళ్ల ధరలు.. సామాన్యుడు సిటీలో ఇల్లు కొనుక్కునే సాహసం చేయలేకపోతున్నాడు. అలాంటిది రూ.87లకు ఇల్లంటారేమిటి.. వంద ఇటుకలైనా వస్తాయో లేదో.. పెరిగిన ధరలని బట్టి చూస్తే అని అనుకోవడం సహజం. మరి ఈ రూ.87లకే ఇంటి మాటేమిటి అంటే.. అదే కదా అసలు విషయం.. అక్కడికే వద్దాం..
అందమైన రోమ్ నగరానికి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో బిసాసియా అనే ముచ్చటగొలిపే ఓ పట్నం ఉంది. అక్కడ ప్రజలు ఎవరూ నివసించక 90 శాతం ఇళ్లు శిధిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వం ఎలాగైనా ఆ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావాలని సంకల్పించింది. అందుకే ఇటలీ కరెన్సీ ఒక యూరో కంటే తక్కువ ధరకే ఇళ్లను విక్రయిస్తోంది.
ఆ నగరానికి ఏమైంది?
ఒకప్పుడు నగరం క్రిక్కిరిసిన జనాభాతో కళకళలాడుతూ ఉండేది. కానీ 1968లో వచ్చిన భూకపం ప్రభావంతో చాలా మంది ప్రజలు ఇతర పట్టణాలకు వలస వెళ్లారు. దాంతో బిపాసియా నగరం పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు అక్కడ అన్నీ ఖాళీ ఇళ్లే దర్శనమిస్తాయి. నగరం అత్యతం పురాతనమైనది కావడంతో ఇళ్లన్నీ ఒకదానికొకటి అతుక్కున్నట్టు కనిపిస్తాయి.
కుటుంబాలు కలిసి నివసించేందుకు బాగుంటుందని ప్రభుత్వం ఇళ్లు కొనుక్కోమని ప్రోత్సహిస్తోంది. ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు కూడా కొనుక్కునేందుకు అవకాశం ఉంది. అయితే ఇల్లు కొనుక్కునే ముందు ఒక ఒప్పందం చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఇల్లు కొనుక్కున్న వారు వారే మరమ్మత్తులు చేయించుకోవాలి. వాటిని కొత్త ఇళ్లలా తీర్చిదిద్దాలి.
తప్పనిసరిగా ఇల్లు కొనుక్కున్న మూడు సంవత్సరాల్లో దాన్ని పునరుద్ధరించాలి. ఈ మేరకు చేసుకున్న ఒప్పందంతో పాటు 5000 యూరోలు డిపాజిట్ చేయాలి. ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాట వాటిని తిరిగి ఇచ్చేస్తారు. ఇల్లు కొనుక్కున్నా అందులో ఉండాల్సిన అవసరం కూడా లేదు. బాగు చేయించి చూపిస్తే సరిపోతుంది. మరి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ బంపరాఫర్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com