India: కెనడాలో వీసా సర్వీసులు పునరుద్ధరించిన భారత్

India: కెనడాలో వీసా సర్వీసులు పునరుద్ధరించిన భారత్
ఎంట్రీ వీసా, బిజినెస్, మెడికల్, కాన్ఫరెన్స్ వీసాల సర్వీసుల పునరుద్ధరణ

కెనడాలో వీసా సర్వీసులను భారత్ పునః ప్రారంభించింది. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య అంశంపై ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం తలెత్తిన తర్వాత భారత్ కెనడాలో వీసా సర్వీసులను నిలిపివేసింది. సుమారు నెల తర్వాత వీసా సేవలు ప్రారంభం కానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కెనడా ఇటీవల తీసుకున్న చర్యలను పరిగణలోకి తీసుకుని భద్రతా పరిస్థితిని సమీక్షించాక వీసా సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఎంట్రీ, బిజినెస్ , మెడికల్ , కాన్ఫరెన్స్ వీసా సేవలు అందించనున్నట్లు ఒట్టావాలోని ఇండియన్ హైకమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఈ చర్య ఇరుదేశాల మధ్య నెలకొన్న ఘర్షణ పరిస్థితులను తగ్గించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కెనడాలోని భారత దౌత్యవేత్తలకు భద్రత కల్పించడంలో ముందడుగు పడితే వీసా సర్వీసులు ప్రారంభమవుతాయన్న విదేశాంగమంత్రి జై శంకర్ చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వెలువడింది.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, అనంతర పరిణామాలతో దెబ్బతిన్న భారత్, కెనడా దౌత్యసంబంధాలు పునరుద్ధరణ దిశగా కీలక ముందడుగుపడింది. దాదాపు నెలక్రితం రద్దు చేసిన వీసా సర్వీసుల్లో కొన్నింటిని పునఃప్రారంభిస్తున్నట్టు కెనడాలోని ఇండియన్ హైకమిషన్ ప్రకటించింది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాల సేవలు తిరిగి మొదలవుతాయని తెలిపింది. అక్టోబర్ 26 నుంచి పాక్షికంగా ప్రారంభమవుతాయని వివరించింది. పరిస్థితులను పరిశీలించిన తర్వాత వాటి ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

కాగా.. ఖలిస్థానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. నిరాధార ఆరోపణలను భారత్ ఖండించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం ఏర్పడింది. ఈ ప్రభావంతో సెప్టెంబర్ చివరిలో వీసా సర్వీసులు నిలిపివేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. ఇదిలావుండగా కెనడాలోని భారతీయ దౌత్యవేత్తల భద్రత విషయంలో పురోగతిని చూస్తుంటే కెనడాకు వీసా సేవలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story