Kerala Nurse: యెమెన్‌లో కేరళ నర్సుకు లభించని ఊరట..

Kerala Nurse: యెమెన్‌లో కేరళ నర్సుకు లభించని ఊరట..
అప్పీల్ ను కొట్టివేసిన యెమెన్ సుప్రీంకోర్టు

ఉపాధి కోసం యెమెన్ వెళ్లి అక్కడ ఓ హత్యకు పాల్పడిన కేరళ నర్సు నిమిష ప్రియకు మరణశిక్ష దాదాపు ఖరారయ్యింది. నిమిష ప్రియ తన కుటుంబంతో కలిసి యెమెన్ దేశం వెళ్లి అక్కడ నర్సుగా స్థిరపడింది. 2014లో ఆమె భర్త, కుమార్తె భారత్ కు తిరిగి వచ్చేశారు. ఆమె మాత్రం యెమెన్ లోనే ఉండిపోయింది. 2015లో ఆమె యెమెన్ లోనే సొంతంగా ఓ క్లినిక్ ప్రారంభించింది. ఆమెకు స్థానికుడైన తలాల్ అబ్డో మహ్దీ సాయపడ్డాడు. విదేశీయులు యెమెన్ లో ఏదైనా సంస్థ ఏర్పాటు చేయాలంటే స్థానికుల భాగస్వామ్యం తప్పనిసరి. అయితే, కొంతకాలానికి నిమిష ప్రియ, మహ్దీ మధ్య గొడవలు మొదలయ్యాయి. యెమెన్ జాతీయుడైన మహ్దీ... నిమిష ప్రియను చిత్రహింసలు పెట్టేవాడు. ఆమె పాస్ పోర్టును లాగేసుకున్నాడు. అతడి నుంచి శారీరక, మానసిక వేధింపులు తీవ్రం కావడంతో అతడి నుంచి తన పాస్ పోర్టును వెనక్కి తీసుకునేందుకు నిమిష ప్రియ ప్రయత్నించింది. మహ్దీకి మత్తు మందును ఇంజెక్షన్ రూపంలో ఇచ్చింది. ఆ మందు మోతాదు మించడంతో మహ్దీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.


యెమెన్ జాతీయుడిని హత్య చేసిన కేసులో 2017 నుంచి ఆ దేశం జైలు శిక్ష అనుభవిస్తున్న కేరళ కు చెందిన భారతీయ నర్సు నిమిషా ప్రియా మరణశిక్ష అప్పీల్‌ను యెమెన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రియా.. తలాల్ అబ్దో మహదీని తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందే ప్రయత్నంలో అతనికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి చంపినందుకు ఆమెను దోషిగా నిర్ధారించారు. యెమెన్‌ వెళ్లాలని ప్రియా తల్లి చేసిన అభ్యర్థనపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు గురువారం కేంద్రాన్ని కోరింది. అరబ్ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా 2017 నుంచి భారతీయ పౌరులకు ప్రయాణ నిషేధం ఉన్నప్పటికీ యెమెన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ప్రియా తల్లి ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేరళ నర్సు తల్లి ఆమెను విడుదల చేయడానికి "బ్లడ్ మనీ" లేదా మహదీ కుటుంబంతో నష్టపరిహారం గురించి చర్చలు జరపడానికి యెమెన్ వెళ్లాలని కోరుతోంది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా... యెమెన్ లో నిమిష ప్రియ అప్పీల్ ను అక్కడి సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయాన్ని కేంద్రం తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో నిమిష ప్రియ తల్లిని యెమెన్ పంపడంలో సాధ్యాసాధ్యాలపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది.

ఈ విషయంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి స్పందించారు. ఈ అంశాన్ని భారత కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని, అవసరమైతే దౌత్య పరమైన సాయం తీసుకుంటామని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story