జగన్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..కేబినెట్ భేటీలో ప్రధానాంశం అదే
ఏపీఎస్ ఆర్టీసీపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన జగన్.. ఇవాళ మరోసారి కార్మిక సంఘాలతో భేటీ కానున్నారు. ఈ భేటీ తరువాత.. సమ్మెను కొనసాగించాలా.. ఆపేయాలా అన్నదానిపై కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకోనున్నాయి..
ఏపీ సీఎం జగన్తో ఇవాళ ఆర్టీసీ సంఘాలు భేటీ కానున్నాయి. గత కొన్నేళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెల్లాలని నిర్ణయించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఈ భేటీ తరువాత సీఎం ఇచ్చే హామీని బట్టి సమ్మె కొనసాగించాలా.. విరమించాలా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామంటున్నాయి కార్మిక సంఘాలు..ఆర్టీసీ సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయి కార్మికులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉందని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఆర్టీసీ కార్మికులపట్ల సానుకూలంగా ఉన్న ప్రభుత్వం.. సంస్థను కాపాడేందుకు సముచిత చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి హామీ లభించినట్లు జేఏసీ నాయకులు చెబుతున్నారు.
ఇప్పటికే సమ్మెకు పిలుపిచ్చిన కార్మికులతో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు చర్చలు జరిపారు. ఈ భేటీలో ఆర్టీసీ విలీనం గురించి సీఎంతో హామీ ఇప్పిస్తే, జేఏసీలో చర్చించి నిర్ణయం చెబుతామని జేఏసీ నేతలు బదులిచ్చారు. సీఎంతో భేటీ ఏర్పాటు చేస్తానని కృష్ణబాబు చెప్పడంతో సమ్మె సన్నాహక సభలు వాయిదా వేసినట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. అయితే సీఎం ఇచ్చే హామీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. ఇప్పుడు నేరుగా సీఎం జగన్తో సమావేశం కానున్న కార్మిక సంఘాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి..
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తొలి కేబినెట్లోనే అజెండా పెట్టారు. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలోనూ దీనిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com