1999 ప్రపంచకప్‌లో జరిగిందే ఇప్పుడు జరుగుతుందా?

1999 ప్రపంచకప్‌లో జరిగిందే ఇప్పుడు జరుగుతుందా?

ప్రపంచకప్‌ను మళ్లీ వర్షం పలకరించింది. భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య సెమీస్‌ అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో రిజర్వ్‌ డే అయిన ఇవాళ్టికి మ్యాచ్‌ వాయిదా పడింది. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ తీవ్రంగా నిరాశచెందారు. మరో మూడు ఓవర్లలో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ ముగుస్తుందనుకున్న సమయంలో వర్షం వచ్చింది. మ్యాచ్‌ నిర్వహించే పరిస్థితి లేనందున అంపైర్లు మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఇవాళ కూడా మ్యాచ్‌ను వర్షం అడ్డుకుంటే.. కోహ్లీసేననే విజేతగా ప్రకటించనున్నారు.

ప్రపంచకప్‌ తొలి సెమీస్‌ను వరుణుడు వెంటాడాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్‌ వర్షం కారణంగా రిజర్వ్‌డే అయిన ఇవాళ్టికి వాయిదా పడింది. 46.1 ఓవర్‌ సమయంలో చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. అదికాస్త భారీ వర్షంగా మారడంతో మ్యాచ్‌ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను ఇవాళ్టికి వాయిదా వేశారు. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి కివీస్‌ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్‌ టేలర్‌-67 పరుగులతో, లాథమ్‌ - 3 పరుగులతో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌తో ఆట మొదలవుతుంది.

మ్యాచ్‌ను ఇవాళ్టికి వాయిదా వేయడానికి ముందు అంపైర్లు తర్జనభర్జన పడ్డారు. ఎట్టిపరిస్థితిల్లోనూ మ్యాచ్‌ ముగించాలని భావించారు. వీలు కుదిరితే ఛేదనలో టీమిండియాను 20 ఓవర్లైనా ఆడించేందుకు ప్రయత్నించారు. అయితే వర్షం వస్తూ పోతుండటంతో మ్యాచ్‌ కొనసాగించడం కష్టమని భావించిన అంపైర్లు రిజర్వ్‌డేకు వాయిదా వేశారు. ఇవాళ కూడా ఇలాంటి పరిస్థితే ఉంటే.. లీగ్‌ దశలో ఎక్కువ పాయింట్లతో ఉన్న కోహ్లీసేన ఫైనల్‌ చేరుకుంటుంది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను టీమిండియా బౌలర్లు చెడుగుడు ఆడుకున్నారు. భువనేశ్వర్‌, జస్ప్రీత్‌ బుమ్రా తొలి రెండు ఓవర్లను మెయిడిన్‌ వేశారు. ఒక్క పరుగు వద్దే ఫామ్‌లో లేని కివీస్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ ను బుమ్రా ఔట్‌ చేసి కివీస్‌కు షాక్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో హెన్రీ నికోలస్‌ తో కలిసి సారథి కేన్‌ విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. జట్టు స్కోరు 69 వద్ద ఓ అద్భుతమైన బంతితో నికోలస్‌ను జడేజా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ తో కలిసి విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ నడిపించాడు. అనంతరం అర్ధశతకం అందుకున్నాడు. భారత బౌలింగ్‌ దెబ్బకు కివీస్‌ 29 ఓవర్లకు గానీ 100 పరుగులు దాటలేదు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. అర్ధశతకం తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో చాహల్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌ ఔటయ్యాడు. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి కివీస్‌ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇక్కడి నుంచే ఇవాళ న్యూజిలాండ్‌ ఆటను ఆరంభించనుంది.

1999లో జరిగిందే మళ్ళీ జరుగుతుందా?

ప్రపంచకప్‌లో భారత్‌ మ్యాచ్‌ వర్షం వల్ల మరుసటి రోజుకు వాయిదా పడటం ఇది రెండోసారి. 1999లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ వరల్డ్ కప్‌కు కూడా ఆతిథ్యమిచ్చింది ఇంగ్లాండే. మొదట భారత్‌ 8 వికెట్లకు 232 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 20.3 ఓవర్లలో 73/3 పరుగులతో ఉన్న సమయంలో వర్షంతో మ్యాచ్‌ ఆగింది. దీంతో తర్వాతి రోజు ఆగిన చోటు నుంచే ఆట కొనసాగించారు. ఇంగ్లాండ్ టపాటపా వికెట్లు పడ్డాయి. దీంతో ఆ జట్టు 169 పరుగులుకే కుప్పకూలింది. తిరిగి ఆ సెంటిమెంటే రెండో రోజు వర్క్ఔట్ అవుతుందా? ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ జయకేతనం ఎగురవేస్తుందేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story