హుజూర్నగర్ కోటపై తొలిసారి గులాబీ జెండా రెపరెపలు
హుజూర్నగర్ కోటపై తొలిసారి గులాబీ జెండా రెపరెపలాడింది. TRS అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43 వేల 233 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచే కారు టాప్గేరులో దూసుకెళ్తోంది. తొలి రౌండ్ నుంచే TRS అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్లారు. ప్రతి రౌండ్లోనూ సంపూర్ణ మెజార్టీ సాధించారు. TRS గెలుపు ఖాయమని భావించినా.. ఈస్థాయిలో మెజార్టీని ఎవరూ ఊహించలేదు. తిరుగులేని ఆధిక్యం రావడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
హుజూర్నగర్ నగర్ కాంగ్రెస్కు కంచుకోట. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ హస్తం హవా నడుస్తోంది. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఉత్తమ్కుమార్ రెడ్డి. అయితే ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్ ఎంపీగా గెలవడంతో.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి..ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి పోటీ చేస్తే.. TRS నుంచి సైదిరెడ్డి బరిలోకి దిగారు. గతంలో ఓటమి పాలయ్యారన్నసింపతీతోపాటు, KCR మార్క్ మ్యాజిక్ కూడా వర్కౌట్ కావడంతో హుజూర్నగర్లో టీఆర్ఎస్ భారీ విజయం నమోదు చేసింది.
మొదటి నుంచి ఊహించినట్లే హుజూర్నగర్లో టీడీపీ, బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. రెండు పార్టీలు కనీస పోటీ కూడా ఇవ్వలేదు. డిపాజిట్లు గల్లంతయ్యాయి. మొదటి నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే హోరాహోరీగా పోరు నడిచింది. ఇక ఆర్టీసీ సమ్మె కూడా ఈ ఉపఎన్నికపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఓటర్లు ఏకపక్షంగా టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com