'దిశ' కేసులో నిందితులను పోలీసులకు అప్పగించే విషయంపై విచారణ
దిశ కేసులో నిందితులను విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాంటూ షాద్ నగర్ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. హత్య కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం రాబట్టాల్సి ఉందని నిందితులను తమకు అప్పగిస్తే విచారణ చేపడతామని పిటిషన్లో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో కస్టడీకి అప్పగింతపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
అటు నిందితులను ఉరితీయాలంటూ ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీసులు సమీక్షించారు. చర్లపల్లి జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిరసన ప్రదర్శనలను, ఆందోళలను అనుమతి ఇవ్వడంలేదని తెలిపారు. ఇలాంటి నిరసన నేపథ్యంలో అవసరమైతే జైలులోనే ఐడెంటిఫికేషన్ పరేడ్ చేయవచ్చని లేదా రాత్రికి రాత్రే నిందితులను కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
మరో వైపు చర్లపల్లి జైలులోని మహానది బ్యారక్లో నాలుగు సింగిల్ సెల్లలో నిందితులను ఉంచారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా చర్యలు తీసుకున్నారు. నిందితులపై మిగతా ఖైదీలు ఇంకా కోపంగా ఉన్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఇతర ఖైదీలెవరూ కనిపంచవద్దని ఆదేశాలు జారీ చేశారు. హంతకుల కదలికలను, వారి మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తున్నారు. కేంద్ర కార్యాలయానికి సీసీ కెమెరాలను అనుసంధానం చేసి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
జైల్లో మాట్లాడేందుకు ప్రయత్నించిన నిందితులను అధికారులు హెచ్చరించారు. అయితే వారిలో ఇద్దరు పెద్దగా అరచుకోవడంతో సిబ్బంది కలుగజేసుకుని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు నిందితులను చూసేందుకు వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఎవ్వరూ రాలేదు. వచ్చిన రోజు నుంచి ఆవే బట్టలతో ఉండడంతో జైలు అధికారులు తప్పని సరి పరిస్థితులలో వేరే దస్తులు నిందితులకు అందజేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com