ఏపీలో ఉల్లి తెచ్చిన రాజకీయ లొల్లి

ఏపీలో ఉల్లికష్టాలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. సబ్సిడీ ఉల్లిపాయల కోసం చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. రైతుబజార్ల వద్ద జనం కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. గుడివాడలో క్యూలైన్లో నిల్చొన్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. ఏపీలో ఉల్లిధరలు బంగారంతో పోటీ పడుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు.
విత్తనాలు, యూరియా కోసం క్యూలైన్లలో నిల్చొని మృతిచెందిన ఘటనలు చూశాం. ఇప్పుడు మరీ దారుణంగా.. ఉల్లి కోసం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. రైతు బజార్లో సబ్సిడీ ఉల్లిపాయల కోసం ఉదయం నుంచే జనం బారులు తీరారు. బహిరంగ మార్కెట్లో కొనలేక.. సాంబయ్య అనే వృద్ధుడు కూడా.. క్యూ కట్టారు. నిలబడి.. నిలబడి ఒక్కసారిగా అక్కడే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు వైద్యులు.
ఉల్లి ధరలపై టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు నేతలతో కలిసి.. పాదయాత్రగా వచ్చారు. ఉల్లిపాయ దండలను మెడలో వేసుకుని ఆందోళన చేపట్టారు నేతలు. రాష్ట్రంలో ఉల్లి ధరలు.. బంగారంతో పోటీపడుతున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నిత్యవసర ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఏపీలో ఉల్లి కష్టాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారు. కానీ జగన్ రెడ్డి గారు చేసే మేలు.. ఉల్లి కూడా చేయదు.. అందుకే దాని రేటు పెంచేశారు అంటూ ఎద్దేవా చేశారు.
ఉల్లి కొరతపై మాజీ మంత్రి కొల్లురవీంద్ర మచిలీపట్నం రైతు బజారు వద్ద ధర్నా చేశారు. డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
గుంటూరులోని పట్టాభిపురం రైతు బజారులో ఉల్లి కోసం దాదాపు 2 కిలోమీటర్ల మేర బారులు తీరారు.. పనులన్నీ మానుకొని గంటల తరబడి నిలుచుంటే.. కేవలం ఒక కేజీ ఇస్తున్నారని జనం మండిపడుతున్నారు.
అక్కడా ఇక్కడా అని లేదు ఏపీ అంతటా ఇదే పరిస్థితి.. ప్రతి రైతు బజార్లోనూ చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి.. మహిళలు, పిల్లలు, వృద్ధులు క్యూ లైన్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com