మూడు దేశాలను వణికించిన భూకంపం
భూకంప ధాటికి ఉత్తరాధి రాష్ట్రాలు వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదైంది. వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం హిందు కుష్ పర్వత ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, కశ్మీరు, జమ్మూలలో ఓ మోస్తరుగా భూమి కంపించింది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్లలో కూడా భూమి కంపించినట్లు తెలుస్తోంది.
శుక్రవారం సాయంత్రం 5.09 గంటలకు హిందుకుష్ పర్వతాల్లో సంభవించిన భూకంపం తీవ్రత 6.3 అని వాతావరణ శాఖ తెలిపింది. కాబూల్కు ఈశాన్యానికి ఉత్తర దిశలో 246 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. భూకంప కేంద్రం హిందుకుష్ పర్వతాల్లో ఉన్నట్లు తెలిపింది. ఈ భూకంపం ప్రభావం పాకిస్థాన్లో కూడా కనిపించిందని పేర్కొంది.
అమెరికా జియొలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంప కేంద్రం ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్లోని జర్మ్ ప్రావిన్స్కు నైరుతి దిశలో 51 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావంతో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ వణికిపోయాయి. ఇస్లామాబాద్, కాబూల్ నగరాల్లో ప్రజలు తమ ఇళ్ళ నుంచి తీవ్ర ఆందోళనతో బయటకు పరుగులు తీశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com