ఇష్టమొచ్చినట్టు కట్టడానికి రాజధాని అంటే వైసీపీ కార్యాలయం కాదు: కన్నా లక్ష్మీ నారాయణ

ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు పిచ్చి ఆలోచనగా చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. అమరావతిలో ఆందోళనలు చేస్తున్న రైతులను ఆయన కలిశారు. వారి పోరాటాలకు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన అనుభవ, అవగాహన రాహిత్యంతో రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీస్తున్నారని కన్నా మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయని గుర్తు చేశారాయన. జగన్కు ఇష్టమొచ్చినట్టు కట్టుకోవడానికి రాజధాని అనేది వైసీపీ కార్యాలయం కాదని హితవు పలికారు. జగన్ నాయకత్వంలో రాష్ట్ర రాజధానికి అడ్రస్ లేని పరిస్థితి దాపురించిందని విమర్శించారు. ఎవరి మీదో కక్షతో ప్రజలను బజారున పడేశారని కన్నా ఆరోపించారు. జగన్ ప్రభుత్వ వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పిన కన్నా.. న్యాయ పోరాటం చేస్తామని రైతులకు ధైర్యం చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com